Pawan Kalyan: ఇక పిఠాపురం నుంచే.. స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన పవన్

పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఈ నియోజకవర్గాల్లో పవన్ ముందుగా పర్యటించనున్నారు. అటు భాగస్వామ్య పార్టీల అధినేతలతో భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు.

Written By: Dharma, Updated On : April 6, 2024 10:17 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ రేపటి నుంచి ప్రచారంలో అడుగు పెట్టనున్నారు. తాను పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రారంభం రోజు నుంచి పవన్ జ్వరంతో బాధపడుతూ వస్తున్నారు. తొలిరోజు అస్వస్థతకు గురికాగా.. పవన్ హైదరాబాద్ వెళ్లారు. ఆ మరుసటి రోజు తిరిగి వచ్చి ప్రచారం ప్రారంభించారు. అయితే జ్వరం తిరగబెట్టడంతో రెండు రోజులు పాటు ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. జ్వరం పూర్తిగా నియంత్రణలోకి రావడంతో రేపటి నుంచి ప్రచారంలో అడుగుపెట్టనున్నారు. పిఠాపురంలో ప్రచారం పూర్తిచేసుకుని మిగతా నియోజకవర్గాలకు వెళ్ళనున్నారు. ఈ మేరకు జనసేన హై కమాండ్ షెడ్యూల్ ప్రకటించింది.

పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఈ నియోజకవర్గాల్లో పవన్ ముందుగా పర్యటించనున్నారు. అటు భాగస్వామ్య పార్టీల అధినేతలతో భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు.అన్ని కార్యకలాపాలు పిఠాపురం నుంచి నిర్వహించేలా పవన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకుగాను పిఠాపురం నియోజకవర్గంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో భారీ భవనాన్ని అద్దెకి తీసుకున్నారు. చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అణువుగా ఉండేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. తుది మెరుగులు దిద్దుతున్నారు.

జ్వరం కారణంతో పవన్ పర్యటన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి ఆయన పర్యటనను పునః ప్రారంభించనున్న నేపథ్యంలో.. జనసేన నాయకత్వం మరోసారి షెడ్యూల్ను ప్రకటించింది. ఈనెల 7న అనకాపల్లి, 8న ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పవన్ పర్యటించనున్నారు. 9వ తేదీ ఉగాది సందర్భంగా పిఠాపురంలో జరిగే కార్యక్రమాల్లో పవన్ హాజరుకానున్నారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నారు. ఉన్నది ఐదు వారాలే కావడంతో పవన్ సైతంప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముందుగా జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో పవన్ పర్యటన ఉండనుంది. తరువాత కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగనుంది. వీలైనంతవరకూ పిఠాపురం లోనే ఉండి రాజకీయ కార్యకలాపాలను కొనసాగించాలని పవన్ భావిస్తున్నారు. మొత్తానికి అయితే ఈ ఐదు వారాల్లో రాష్ట్రం మొత్తం చుట్టేయాలని పవన్ డిసైడ్ అయ్యారు.