Pastor Abhinay Darshan: పాస్టర్లు రాజకీయాల్లోకి రావడం మనదేశంలో కొత్తేమీ కాదు. ఆ పార్టీలను ఏర్పాటు చేసి.. మీడియాలో సంచలనం సృష్టించి.. ఆ తర్వాత మూసివేసిన వారే అధికం. ఆ జాబితాలో చాలామంది ఉన్నారు. అయితే పాస్టర్ అభినయ దర్శన్ మాత్రం దీనికి పూర్తి విభిన్నం. ఆయనకు మీడియాను ఎలా అటెన్షన్ చేసుకోవాలో తెలుసు. మీడియాను తనవైపు ఎలా తిప్పుకోవాలో తెలుసు. అందువల్ల కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో ఆయన ప్రముఖంగా కనిపిస్తున్నారు.
ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ ప్రాంతంలో పర్యటించి వస్తుండగా అభినయ దర్శన్ ప్రమాదానికి గురయ్యారు.. కొంతమంది ఆయన మీద దాడి చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. మీడియా వ్యక్తులు ఆయన గొంతుముందు మైకులు పెట్టగానే చించుకున్నారు. తాను పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని.. ప్రజల గురించి తన కొట్లాడుతుంటే కొంతమంది గిట్టనివారు ఇలాంటి దాడి చేశారంటూ గొంతు చించుకున్నాడు. దీంతో కొన్ని మీడియా సంస్థలు క్రైస్తవుల మీద జరిగిన దాడిగా దీనిని చిత్రీకరించాయి. పాస్టర్ పగడాల ప్రవీణ్ ఘటనకు దీనికి లింకు పెట్టి స్టోరీలు అల్లాయి. అంతేకాదు ఏపీ రాష్ట్రంలో క్రైస్తవులకు భద్రత లేకుండా పోయిందని కన్నీరు కార్చాయి.
ఈ ఘటన ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. దీనిపై ఏపీ పోలీసులు స్పందించారు. లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దీంతో అసలు విషయాలు తెలుగులోకి వచ్చాయి. అభినయ దర్శన్ మీద దాడి చేసింది వేరే వ్యక్తులని.. వారికి.. అభినయ దర్శన్ కు పాత గొడవలు ఉన్నాయని తేల్చారు. అంతేకాదు తాను జనాల్లో సానుభూతి పొందడానికి ఈ తరహా డ్రామాలు ప్లే చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అనేక కేసులు అభినయ దర్శన్ మీద ఉండడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ విషయం మీద స్పందించారు. దర్శన్ విషయాన్ని పోలీసులు చూసుకుంటారని.. ఇకపై అతని డ్రామాలకు ఫుల్ స్టాప్ పడ్డట్టేనని వ్యాఖ్యానించారు.
ఇన్ని రోజుల పాటు తనను తాను పేదల పక్షపాతిగా ప్రచారం చేస్తున్న అభినయ దర్శన్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ విషయంలో సంచలన ప్రకటన చేశారు.”భరోసా పార్టీ నాది కాదు. దీనిని వేరే వ్యక్తి స్థాపించారు. దీనిని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించారు. నాకున్న ఫాలోయింగ్ చూశారు. ఏపీకి అధ్యక్షుడిగా ఉండాలని సూచించారు. అప్పటినుంచి నేను భరోసా పార్టీకి ఏపీ రాష్ట్రానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను.. భరోసా పార్టీ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని” అభినయ దర్శన్ వ్యాఖ్యానించాడు.. ఇతడి మీద ఉన్న కేసులను విచారించేందుకు ఏపీ పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు.. ఆ తదుపరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
