Site icon OkTelugu

Nandi Awards Andhra Pradesh 2026: నంది అవార్డులిస్తారా? చంద్రబాబు కోర్టులో టాలీవుడ్ బంతి

Nandi Awards Andhra Pradesh 2026

Nandi Awards Andhra Pradesh 2026

Nandi Awards Andhra Pradesh 2026: తెలుగు చిత్ర పరిశ్రమకు( Telugu cinema industry) సంబంధించి నంది అవార్డులు కీలకం. ఏటా ఉత్తమ చిత్రాలతో పాటు నటులు, వివిధ విభాగాలకు చెందిన వారికి నంది అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నంది అవార్డులు అందించలేదు. దీనిపై రకరకాల ప్రచారం నడుస్తోంది. మొన్ననే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల పేరిట ప్రధానం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డుల పేరిట అందిస్తుండగా.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గద్దర్ అవార్డులను అందిస్తూ వస్తోంది. మొన్ననే రేవంత్ సర్కార్ ఈ గద్దర్ అవార్డుల ప్రదానం చేసింది. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు అందించాలని ఇదే వేదిక నుంచి చిత్ర పరిశ్రమ ప్రముఖులు విజ్ఞప్తి చేయడం విశేషం.

Also Read: పవర్‌ హౌస్‌గా కరీంనగర్‌.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..

* రెండేళ్లు అవుతున్నా..
గత రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు జరగలేదు. కేవలం టిక్కెట్ల ధర పెంపు కోసమే అన్నట్టు సంబంధిత మంత్రిత్వ శాఖ ఉన్నట్టు కనిపించింది. అయితే వైసీపీ ప్రభుత్వం మాదిరిగా టిడిపి కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగించే ఏ నిర్ణయాలు తీసుకోలేదు. పైగా ఎటువంటి వివక్ష చూపిన పరిస్థితి కూడా లేదు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు.. అన్ని సినిమాలకు ఏపీ ప్రభుత్వం మినహాయింపులు ఇస్తూ వచ్చింది. కానీ కీలకమైన నంది అవార్డుల విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

* అనేక పరిణామాలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan) చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి. వాస్తవానికి వైసీపీ చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టిన తరుణంలో.. సినీ పరిశ్రమ అంతా టిడిపి కూటమి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంది. అయితే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది కానీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఎవరు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవలేదు. మరోవైపు ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. సీఎం చంద్రబాబును కలిసేందుకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు అపాయింట్మెంట్ కోరినట్లు కూడా టాక్ నడిచింది. కానీ ముఖ్యమంత్రిని కలిసిన విషయాలు ఏవి బయటకు రాలేదు.

* ఆ కామెంట్స్ రాకూడదని..
అయితే నంది అవార్డుల( Nandi awards ) విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణ జరగలేదు. ఆపై నంది అవార్డులు ఇస్తే ఆ ప్రభావం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉంటుంది. టిడిపికి చెందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి. నంది అవార్డులు ఇస్తే సొంత వారికి ఇచ్చుకున్నారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసే అవకాశం ఉంది. అందుకే నంది అవార్డుల జోలికి వెళ్లనట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాత్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం నంది అవార్డుల బంతి ఇప్పుడు చంద్రబాబు కోర్టులో ఉన్నట్లు అర్థమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో??

Exit mobile version