Mudragada Padmanabham : కాపు నేతగా.. విశేషమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా.. ముద్రగడ పద్మనాభానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరు ఉంది. ముద్రగడ పద్మనాభం విలక్షణమైన రాజకీయ నాయకుడు. ముఖ్యంగా కాపు జాతి కోసం ఆయన ఉద్యమాలు చేశారు. కాపు జాతి హక్కుల కోసం పోరాటాలు చేశారు. వంగవీటి రంగా తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ముద్రగడ పద్మనాభం విలువలు ఉన్న రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 73 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో హైదరాబాదులో ఆయన కన్నుమూశారు.
ముద్రగడ పద్మనాభం మృతి చెందిన వార్తను తెలుసుకున్న రెండు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు… ముఖ్యమంత్రులు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.. ఆయన అనారోగ్యంతో కన్ను మూయడం బాధాకరమని సంతాప సందేశాలలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ముద్రగడ పద్మనాభం పిల్లలకు సానుభూతి తెలిపారు.
ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితం విలక్షణమైనది. ఆయన 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ప్రాంతంలో జన్మించారు. మొదటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభానికి రాజకీయాలంటే చాలా ఇష్టం. ప్రజలకు సేవ చేయడం అంటే మరింత ఇష్టం. అందువల్లే 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే ఏడాది జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. సీనియర్ ఎన్టీఆర్.. చెన్నారెడ్డి ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. జనతా పార్టీ… తెలుగుదేశం పార్టీ… కాంగ్రెస్ పార్టీ.. ఇలా భిన్నమైన రాజకీయ వేదికలలో ప్రయాణించి.. విలక్షణమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పటికీ ఏమాత్రం అహం భావాన్ని ప్రదర్శించలేదు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ముఖ్యంగా కాపు జాతి హక్కుల కోసం పోరాటం సాగించారు. తుని ఘటన ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో మర్చిపోలేనిది. ఆ ఘటన సమయంలో ఆయన తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు.. ఒక దశలో ఆరోపణలు కూడా చవి చూశారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీకి బహిరంగంగా మద్దతు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చుకుంటాను అన్నారు.
అనుకున్నట్టుగానే అలా మార్చి చూపించారు. జనతా పార్టీ ద్వారా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన ఆయన.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఎన్నడు విమర్శలు ఎదుర్కోలేదు. ఏనాడు అవినీతి ఆరోపణలు చవి చూడలేదు. రాజకీయంగా అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అటువంటి నాయకుడు జగన్ కోసం విలువలు వదిలేశారు. కుమార్తెకు దూరమయ్యారు. చివరికి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో చనిపోయారు.. ఆ పేరు మార్పు తప్ప.. పద్మనాభం రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమే.
