Monsoon Effect: ఏపీలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. ప్రధానంగా దక్షిణ కోస్తా తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాలపై రుతుపవనాల ప్రభావం ఉంటుంది. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసాయి. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది.
* ఉపరితల ఆవర్తన ప్రభావంతో..
ప్రస్తుతం బంగాళాఖాతం పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావం కోస్తాంధ్ర పై ఉంది. చాలా చోట్ల ఉరుములతో కూడిన వాన పడుతోంది. రాయలసీమపై కూడా చల్లటి వాతావరణం కొనసాగుతోంది. నేడు కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల,పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప,అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈదురు గాలులు వీస్తున్నప్పుడు.. పిడుగులు పడుతున్నప్పుడు స్తంభాలు, చెట్ల వద్ద నిల్చో వద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది.
* తెలంగాణలో సైతం..
మరోవైపు తెలంగాణకు సైతం భారీ వర్షం సూచన ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి అక్కడ. రాజధాని హైదరాబాద్ నగరం తో పాటు అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదయింది. మరో రెండు రోజులపాటు అదే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో సైతం బలమైన మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు పడతాయి

