Maha News and ABN : చేయాల్సిందంతా చేసేసి ‘మహా’సారీ చెబితే సరిపోతుందా? ఏబీఎన్ సంగతేంది?

దీనిపై ముప్పేట దాడి ఎదురుకావడంతో మహాటీవీ యాజమాన్యం స్పందించింది. జరిగిన తప్పిదాన్ని క్షమించాలని కోరింది.

Written By: Dharma, Updated On : June 1, 2023 12:07 pm
Follow us on

Maha News and ABN : వివేకా హత్య కేసును ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రాధాన్యతాంశంగా తీసుకుంది. అటు అవినాష్ రెడ్డి విచారణ, అరెస్టు ఎపిసోడ్ లపై ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అవినాష్ రెడ్డి చట్టాలను, అధికారాలను అడ్డంపెట్టుకొని తప్పించుకొని తిరుగుతున్నారని ఆరోపించింది. ప్రత్యేక డిబేట్లు నిర్వహించింది. వైసీపీ వ్యతిరేక శిబిరానికి చెందిన ప్రముఖులతో చర్చాగోష్టి నిర్వహించింది. ఈ క్రమంలో న్యాయవ్యవస్థపైనే ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై హైకోర్టు సీరియస్ యాక్షన్ కు దిగడంతో క్షమించాలని కోరడం సంచలనంగా మారింది.

ఈ నెల 26న హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసింది. 31 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా టీవీ ఛానళ్లలో ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. డిబేట్లు సైతం పెట్టారు. వీటికి న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేసి సస్పెండైన జడ్జి రామక్రిష్ణ పిలిచారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై మధ్యంతర ఉత్వర్వులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. హైకోర్టు జడ్జిలకు డబ్బుల సంచులు వెళ్లాయని… అందుకే అయన అరెస్ట్ కావడం లేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఇదంతా సదరు ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దీనిని హైకోర్టు సీరియస్ తీసుకుంది. ఆ ఛానళ్ల వీడియోలను ముందుంచాలని హైకోర్టు వర్గాలను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఈ అంశం సీరియస్ గా మారింది.

ఈ రెండు ఛానెళ్లలో డిబేట్లు నడిపింది సీనియర్ జర్నలిస్టులు. కోర్టుల మీద వ్యాఖ్యానించడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు కేసు విచారించిన జడ్జి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విచారణ నుంచి తప్పుకోవాలని భావించాను. కానీ సుప్రీం ఆదేశాలు పవిత్రమైన న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో విచారణ కొనసాగించాను అని చెప్పుకొచ్చారు. టీవీ ఛానళ్ల తీరు కోర్టు ధిక్కరణకు వస్తుందని స్పష్టం చేశారు.

దీనిపై ముప్పేట దాడి ఎదురుకావడంతో మహాటీవీ యాజమాన్యం స్పందించింది. జరిగిన తప్పిదాన్ని క్షమించాలని కోరింది. తమకు న్యాయవ్యవస్థపై అపార గౌరవం ఉందని.. సదరు మాజీ న్యాయ నిపుణుడు చర్చలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని చింతిస్తున్నామని ప్రకటించింది. మరోసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేసింది. మరో ఛానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. చేసిందల్లా చేసి ఇప్పుడు తప్పు అయిపోయిందని సారీ చెబితే సరిపోతుందా? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై హైకోర్టు ఎటువంటి యాక్షన్ కు దిగుతుందో చూడాలి మరీ.