Nara Lokesh Strategy: ఏ రాజకీయ పార్టీ అయినా రాణించాలి అంటే కచ్చితంగా టీం వర్క్ ఉండాలి. అధినేత ఆదేశాలను పాటించే వారు కచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ అధినేత పార్టీపై పట్టు సాధించగలరు. అయితే నందమూరి తారక రామారావు టిడిపి ఏర్పాటు చేసిన సమయంలో నమ్మకస్తులు దొరికారు. తరువాత చంద్రబాబు టీం లో కూడా కొంతమంది సీనియర్లు చేరారు. అయితే ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకత ఉంది. చంద్రబాబుకు ప్రత్యేకత మరోలా ఉంది. ఎన్టీఆర్ పార్టీ నేతలను గౌరవించేవారు. ఒక నిర్ణయం తీసుకుని పార్టీ నేతల అభిప్రాయం అడిగేవారు. చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకునే ముందు పార్టీ నేతలతో చర్చించి వారి అభిప్రాయాన్ని తీసుకునేవారు. అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చేవారు. అయితే లోకేష్ మాత్రం ఇప్పుడు టీం వర్క్ ను నమ్ముకున్నారు. తనకంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని ఒక నిర్ణయానికి వస్తున్నారు.
* సరిగ్గా అంచనా వేయలేక..
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ విషయంలో ఆయన అంచనాలు తప్పాయి. దాని పర్యవసానాలే 1995లో టిడిపి సంక్షోభం. తెలుగుదేశం పార్టీని వదులుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ ఒక పట్టుదల మనిషి. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించరు. ఈ క్రమంలోనే చాలామంది సీనియర్లు ఆయనకు దూరం అయ్యారు. చంద్రబాబుపై వెన్నుపోటు అపవాదు వచ్చింది నిజమే. కానీ టిడిపిలో చాలామంది సీనియర్లు ఎన్టీఆర్ తో విభేదించి చంద్రబాబు వద్దకు చేరారు తప్పించి.. చంద్రబాబు వారిని ఆకర్షించారు అనలేం. అయితే ఆ ఎపిసోడ్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు చంద్రబాబు. అందుకే పార్టీలో సీనియర్లను గౌరవిస్తూ వచ్చారు. ముఖ్యంగా విధేయుల బృందాన్ని తన చుట్టూ ఉంచుకున్నారు. అప్పట్లో నందమూరి తారక రామారావు లో ఈ ఆలోచన లేదు. ఆయన ఎంతవరకు కాంగ్రెస్ లాంటి పార్టీ నే ఓడించాను.. తన మాట, తన గీత పార్టీ నేతలు దాటరు అని భావించారు. ఈ క్రమంలో జరిగిన తప్పిదాలతో చాలామంది నేతలు మనస్థాపానికి గురయ్యారు. ఎన్టీఆర్ కు దూరమయ్యారు.
* సరిగ్గా వాడుకున్న చంద్రబాబు..
అయితే చంద్రబాబు అపర చాణుక్యుడు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఇదే మాట చెబుతారు. ఎన్టీఆర్ ఎపిసోడ్లో చాలా రకాల గుణపాఠాలు నేర్చుకున్నారు. పార్టీలో పరిస్థితిని ఆకలింపు చేసుకున్నారు. అందుకే పార్టీలో సీనియర్లను తన చెప్పు చేతల్లో ఉంచుకున్నారు. వారిని గౌరవించి ఒక రక్షణ కవచంలా మార్చుకున్నారు. అందుకే మధ్యలో వైయస్ రాజశేఖర్ రెడ్డి రూపంలో ప్రలోభాలు ఎదురయ్యాయి. ప్రజారాజ్యం పార్టీ రూపంలో ప్రత్యామ్నాయం వచ్చింది. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఒక ఆకర్షణ శక్తి ఉద్భవించింది. కానీ వాటన్నింటినీ పట్టుకొని నిలబడింది అంటే చంద్రబాబు చాణుక్యం. అదే టిడిపిని నిలబెట్టింది. అయితే ఇప్పుడు టిడిపిలో మూడో తరం వచ్చింది. లోకేష్ టీం రెడీ అయింది. కిలారు రాజేష్ లాంటి నేతలను ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టులో పెట్టారు అంటే.. లోకేష్ ఆలోచన ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అయితే లోకేష్ టీం కూర్పు ఇప్పటిది కాదు. గత రెండు సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ వస్తోంది. చంద్రబాబు టీంకు మించి.. భవిష్యత్తు ఆలోచించి దీనిని రూపొందించినట్లు అర్థమవుతోంది.