Kotamreddy Sridhar Reddy: ఏ నాయకుడు అయిన తన సొంత పార్టీకి విధేయతతో పని చేయాలి. నాయకత్వం సైతం అదే నమ్మకంతో ఆ నేతపై ఆధారపడి రాజకీయం చేస్తుంది. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం పై వీరా విధేయతతో ఉన్నారు. టిడిపి నాయకత్వం సైతం ఆయన విషయంలో చాలా గౌరవభావంతో ఉంటోంది. ఉత్తరాంధ్ర నుంచి మహానాడు వేదికను నెల్లూరు జిల్లాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి మహానాడు ను నెల్లూరు జిల్లాకు షిఫ్ట్ చేశారు. అయితే నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణ అనే సరికి.. అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉండగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది టిడిపి నాయకత్వం. తొలుత మహానాడు ను మార్చే క్రమంలో సంప్రదించింది తెలుగుదేశం నాయకత్వం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికేనట.
* లక్షలాదిమంది పాల్గొనే పండుగ..
సాధారణంగా మహానాడు అంటే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు భారీగా తరలివస్తాయి. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్ నుంచి సైతం టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తారు. మూడు రోజులపాటు తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద పండుగ. అయితే మహానాడులో ప్రత్యేకతలు చాలా ఉంటాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా అందించే భోజనాలు, వసతి అన్ని ప్రత్యేకమే. రెండు రోజులపాటు నాయకులతో పాటు కార్యకర్తలు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తుంటారు. లక్షలాదిమంది తరలివచ్చిన ఏ లోటు లేకుండా పంపించడం మహానాడు ప్రత్యేకత.
* శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు..
గత ఏడాది రాయలసీమలో మహానాడు జరిగింది. కడప జిల్లాలో నిర్వహించి అదుర్స్ అనిపించారు. ఈ ఏడాది మాత్రం ఉత్తరాంధ్రలో నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావించింది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది. స్థల పరిశీలన కూడా చేసింది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ విమానాశ్రయం ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ జూన్ నెలలో వస్తున్నారు. ఈ క్రమంలో అదే సమయంలో మహానాడు నిర్వహణ అనేది ఇబ్బందికరమని భావించింది టిడిపి నాయకత్వం. అందుకే నెల్లూరు జిల్లాకు మహానాడు ను షిఫ్ట్ చేసింది. అయితే నాయకత్వం నుంచి తొలుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఫోన్ వెళ్ళింది. ఆ మరుక్షణం ఆయన రంగంలోకి దిగిపోయారు. నెల్లూరు నగరంలో ఉన్న అన్ని హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లతోపాటు ఉండేందుకు వీలుగా ఉన్న ఫామ్ హౌస్ లను సైతం బుక్ చేశారు. భారీ హోర్డింగులతో నెల్లూరు మొత్తం నింపే ప్రయత్నంలో ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్ తో పని చేస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డితో ముందుగానే అంటే 16 నెలలు పదవి ఉండగానే విభేదించారు. తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ గౌరవంతోనే టీడీపీ నాయకత్వం కూడా కోటంరెడ్డి విషయంలో ప్రత్యేకంగా వ్యవహరిస్తోంది. కోటంరెడ్డి దూకుడు చూస్తుంటే .. పునర్విభజన జరిగితే ఆయనతో పాటు సోదరుడు కూడా టికెట్ అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే కోటంరెడ్డి ఇప్పుడే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇదే కమిట్మెంట్ తో పని చేశారు.