Tirumala Laddu Controversy : ఏపీలో తిరుపతి లడ్డు వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డు తయారీలో జంతు కొవ్వు వినియోగించారని గుజరాత్ కు చెందిన జాతీయ స్థాయి ల్యాబ్ నిర్ధారించింది. అటు అదే రంగానికి చెందిన నిపుణులు సైతం తప్పకుండా కల్తీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత కంపెనీగా గుర్తింపు పొందిన నందిని నెయ్యి కాదని.. కొత్త సరఫరాదారులతో ఒప్పందాలు చేసుకోవడం అనుమానాలకు బలం పెంచుతోంది.ముఖ్యంగా ఈ విషయంలో వైసీపీ కార్నర్ అవుతోంది. వైసిపి హయాంలోనే ఇదంతా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వంతో పాటు టిడిపి నేతలు సైతం ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం తప్పుపడుతోంది. అయితే దీనిపై వైసీపీ సైతం కౌంటర్ అటాక్ చేయడం చేస్తోంది.టీటీడీ చైర్మన్లు గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి,కరుణాకర్ రెడ్డి స్పందించారు.జగన్ సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు.అయితే ఇప్పటికే ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.వైసీపీకి డామేజ్ చేసింది.ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా..జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
* పట్టుదలగా పవన్
ఇంకోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో మరింత పట్టుదలగా ఉన్నారు.దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లుగా టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా అనేక రకాల చర్యలు జరిగాయని పవన్ గుర్తు చేశారు. టీటీడీని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట పదివేల రూపాయల విరాళాలు సేకరించి.. కేవలం 500 రూపాయలకు రశీదులు ఇచ్చారని గుర్తు చేశారు. అంతటితో ఆగని పవన్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఈ అంశం మరింత వైరల్ అయ్యేలా చేశారు.
* వైసీపీకి డామేజ్
అయితే ఈ విషయంలో వైసిపి తప్పిదం ఉన్నా.. లేకపోయినా.. ఆ పార్టీకి మాత్రం తీరని నష్టం వాటిల్లింది. వైసిపి హయాంలో టీటీడీలో అన్యమత ప్రమేయం అధికమైందన్న ఆరోపణలు అప్పట్లో బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. ఇప్పుడు తాజా వివాదంతో మెజారిటీ ప్రజలు మాత్రం అది నిజమేనన్నట్టు అభిప్రాయపడుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇదంతా చంద్రబాబు చేస్తున్న డ్రామాగా అభివర్ణిస్తున్నారు. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి అయితే చంద్రబాబు కుటుంబంతో సహా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. అయితే దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. సవాల్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.కానీ తరువాత వైవి సుబ్బారెడ్డి సైలెంట్ అయ్యారు.
* దీపం వెలిగించి.. ప్రమాణం చేసి
అయితే వైసిపి హయాంలో చివరి ఏడాది చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఏకంగా ప్రమాణానికి సిద్ధపడ్డారు. తిరుమలకు చేరుకున్న ఆయన.. అక్కడి ప్రత్యేక కోనేరులో స్నానం చేశారు. తిరుమల వెళ్లిచేతిలో దీపం వెలిగించి ప్రమాణం చేశారు.తన హయాంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని ప్రమాణం చేశారు. అదంతా చంద్రబాబు సృష్టి అని ఆరోపించారు. అయితే కరుణాకర్ రెడ్డి దాదాపు 8 నెలలు పాటు మాత్రమే టీటీడీ చైర్మన్ గా ఉన్నారు.అంతకుముందు వై వి సుబ్బారెడ్డి ఉండేవారు. కానీ కరుణాకర్ రెడ్డి ఒక్కరే ప్రమాణం చేసి.. అగ్గి రాజేయడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More