Janasena Central Cabinet: కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యం ఇస్తోంది రాజకీయపరంగా. ఎందుకంటే నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన బలాన్ని అందించింది ఏపీ. కూటమిపరంగా 21 పార్లమెంట్ స్థానాలు అందించింది. టిడిపి 16 ఎంపీలతో ఎన్డీఏలో రెండో స్థానంలో నిలిచింది. అందుకే ఆ పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు లభించాయి. అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షాలకు మంత్రి పదవులు దక్కాయి. రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న జనసేనకు మాత్రం ఒక్క పదవి లేదు కేంద్ర మంత్రివర్గంలో. అందుకే ఈసారి జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని తెలుస్తోంది. ఇటీవల ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరైన పవన్ కు కేంద్ర పెద్దలు ఈ విషయాన్ని చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే జనసేన నుంచి ముగ్గురు ఎంపీలు ఉంటారు. ఇద్దరు లోక్సభ సభ్యులు ఉన్నారు. తాజాగా రాజ్యసభకు జనసేన తరఫున లింగమనేని రమేష్ ప్రాతినిధ్యం వహించనున్నారు.
* జనసేనకు ముగ్గురు ఎంపీలు..
ఒకవేళ జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తే ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ప్రశ్న. అయితే ఆ పార్టీకి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఉన్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్ ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వల్లభనేని బాలశౌరికి పవన్ ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఆయన సీనియర్ నాయకుడితో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం కలిసి వచ్చే అంశం.
* సుదీర్ఘ నేపథ్యం..
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది వల్లభనేని బాలసౌరికి. 2004లో తెనాలి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో తెనాలి పార్లమెంట్ స్థానం కనుమరుగయింది. దీంతో 2009 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే బాలశౌరి సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ఆయనకు కేంద్రమంత్రి పదవికి పవన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

