YS Jagan Politics: జగన్మోహన్ రెడ్డి రాజకీయం వింతగా ఉంది. శత్రువు భాగస్వాములను మిత్రులుగా చూస్తున్నారు. నేను ఎన్డీఏ కూటమితో ఫైట్ చేయను. కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయను. నా శత్రువు కేవలం చంద్రబాబు మాత్రమే అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. చంద్రబాబును ప్రధాన శత్రువుగా ఫిక్స్ చేసి.. ఆయనకు మద్దతుగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి.. వీరిద్దరికీ సహకారం అందిస్తున్న బిజెపిని మాత్రం పెద్దన్నగా ఊహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ రాజకీయం చూసి జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. అంతెందుకు సొంత కేడర్ కు సైతం జగన్ చర్యలు విస్మయానికి గురిచేస్తున్నాయి. అసలు మనం యుద్ధం ఎవరితో చేస్తున్నాం? శత్రువు ఎవరు? అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే జగన్ వైఖరి సొంత పార్టీ శ్రేణులతో పాటు జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పార్టీలకు సైతం ఆశ్చర్యం కలగక మానదు.
* వారు వద్దంటున్నా..
ఏపీలో అధికారంలో ఉన్నది టిడిపి, జనసేన, బిజెపి లతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం. కానీ అదే జాతీయస్థాయి ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామి. పరస్పర రాజకీయ ప్రయోజనాలు అందుకుంటున్నాయి ఆ మూడు పార్టీలు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విపరీతమైన ద్వేష భావంతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి వారితో భాగస్వాములుగా ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాల పట్ల మాత్రం గొప్ప గౌరవభావంతో మెలుగుతున్నారు. ఇదేం రాజకీయమో చెప్పలేం. నీ స్నేహం వద్దు రా బాబు అంటూ కేంద్ర పెద్దలు పక్కన పెట్టిన జగన్ మాత్రం వారి వెంట పడుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ వింత రాజకీయం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
* అంతా సిల్లీ రాజకీయం..
రాష్ట్ర రాజకీయాలను సిల్లీ రాజకీయాలుగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏదో గ్రామస్థాయి రాజకీయం అన్నట్టు కూటమిలతో పనిలేదు, సిద్ధాంతాలతో పనిలేదు, భావాలతో పనిలేదు అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డి అయినా.. ఇప్పుడు చంద్రబాబు అయినా ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాలతో పాటు వారి భాగస్వామ్య పక్షాలపై రాజీలేని పోరాటం చేసేవారు. కనీసం ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విధులు పై గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేశారు. పైగా కేంద్రానికి అవసరం అయినప్పుడు రాజకీయ సహకారం అందించారు.
* పోరాడితేనే గుర్తింపు..
చంద్రబాబును వ్యతిరేకిస్తాను కానీ మోదీతో పాటు అమిత్ షాను ప్రేమిస్తాను అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. కేంద్ర పెద్దలు క్లియర్ కట్ గా తేల్చేశారు. తాము చంద్రబాబుతో సుదీర్ఘ పొత్తు ఉంటుందని ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా గళం ఎత్తితేనే జగన్మోహన్ రెడ్డికి విలువ ఉంటుంది. రేపు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తే ఎన్డీఏకు మద్దతు ఇవ్వమని పిలుపునిస్తారే కానీ.. జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పగలరా. ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని సొంత పార్టీ వారే ఆవేదనతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇలాంటి వైఖరి వల్లే జగన్ దెబ్బతిన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి. నాడు జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లారు కాబట్టి ప్రజలు గుర్తించారు. 2019 నుంచి 2024 మధ్య బిజెపితో స్నేహం చేశారు కాబట్టి ఆయన పోరాట పటిమ తగ్గి ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా ఆయన పోరాటం చేయకుండా.. చంద్రబాబును మాత్రమే వ్యక్తిగతంగా ప్రత్యర్థిగా చూస్తానంటే ప్రజలు గుర్తించే పరిస్థితి ఉండదు.

