Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి రాజధానుల విషయంలో స్పష్టంగా తన స్టాండ్ ను తెలియజేశారు. బంతి ప్రజల కోర్టులో విడిచిపెట్టారు. ఇక తేల్చుకోవాల్సింది ఏపీ ప్రజలే. మావిగన్ అనేది తమ అభిమతమని.. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అనే ఎజెండాతో జరుగుతాయని.. చంద్రబాబు అమరావతికి మద్దతు తెలిపితే కూటమికి.. మావిగన్ కు మద్దతు తెలిపితే వైసీపీకి ప్రజలు ఓట్లు వేస్తారని తేల్చి చెప్పారు జగన్. నిజంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద సాహసమే చేశారు. తన మావిగన్ ప్రతిపాదన ఏపీ ప్రజలకు నచ్చిందని భావిస్తున్నారు.
* సాహస ప్రకటన..
ముసుగులో గుద్దులాటలు లేకుండా జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. మావిగన్ అనేది తమ రాజధానిగా చెప్పుకొచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం పొందుపరుస్తామని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం ప్రకటించడం పెద్ద సాహసం. ఎప్పటికే రాజధానులను మారుస్తున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒక విమర్శ ఉంది. అమరావతిని వ్యతిరేకించి మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగన్ ఫైనల్ అంటూ మాట్లాడుతున్నారు. నిజంగా దీని ప్రభావం ఏపీ పై పడుతుంది. విద్యాధికులతో పాటు తటస్తులు వైసీపీ వైఖరి పై వ్యతిరేకంగా ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేయడం సాహసమే.
* లెక్కచేయని వైనం..
ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని నిర్వీర్యం చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఎన్ని భవనాలు కట్టినా నేలమట్టం చేసి.. మావిగన్ ను అభివృద్ధి చేస్తాం అన్నది జగన్ మాట. 50 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల మాట ఏంటి? 50 వేల కోట్ల రూపాయల రుణం మాట ఏంటి? అంటే తెలియని పరిస్థితి. దాదాపు 15 సంవత్సరాల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండడం అంటే దాని వెనుక జగన్ వైఫల్యమే కనిపిస్తోంది. ఆయన ప్రజల్లో ఒక రకమైన విభజన రేఖ తేవాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది. కానీ అమరావతి రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్న జగన్మోహన్ రెడ్డి లెక్క చేయకపోవడం ఆ పార్టీ శ్రేణులనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
* మళ్లీ రాజధాని వివాదం..
ఒక రాష్ట్రానికి రాజధాని అవసరమే. కానీ రాజధాని వివాదం అనేది ఎన్ని రోజులు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఏకాభిప్రాయంతో అమరావతి ప్రతిపాదన జరిగింది. కానీ దానికి జై కొట్టారు జగన్. తరువాత మాట మార్చి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. అయినా కట్టలేకపోయారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అమరావతిపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న ద్వేషం ఎప్పటికప్పుడు బయటపడుతోంది. కానీ వైసీపీలో మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ పార్టీ నేతలు తాము అమరావతికి వ్యతిరేకం కాదు అని తేల్చి చెబుతున్నారు. మొన్నటికి మొన్న అమరావతి రైతులకు మద్దతుగా పరామర్శకు వెళితే ప్రతిఘటన ఎదురయింది వారికి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చి రాజధాని రాజకీయం అంశాన్ని సజీవంగా ఉంచారు. ఒక రాష్ట్ర పాలన అంటే కేవలం రాజధాని అన్నట్టు పుష్కరకాలంగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకవైపు అమరావతిలో శాశ్వత నిర్మాణాలు కొనసాగుతుండగా.. ఇప్పుడు జగన్ మావిగన్ ను బలపరచడం చూస్తుంటే మాత్రం ఆయన లో ఉన్న రాజకీయ విధ్వంస ఆలోచనను బయట పెట్టింది.
