Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ.. లేనప్పుడు మరో స్ట్రాటజీ అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు అన్నారు. ఇప్పుడు మాత్రం నా కాపులు అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాపుల కోసం ప్రత్యేక పథకం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు ఇచ్చిన ఈ బీసీ రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసేందుకు కూడా సాహసించలేదు. ఆయన కుమారుడిని అమానుషంగా పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కాపులను చాలా హీనంగా చూశారు. ఇప్పుడు సాయి కృష్ణ అనే యువకుడు అదృశ్యం కావడం, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏకంగా ఆయన కోసం పరితపించడం ప్రారంభించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. కూటమి ప్రభుత్వం పై ఒక రాయి వేసి.. ఇప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి.
* అప్పట్లో కాపులపై చులకన..
కాపులు రాజకీయంగా ఏం చేస్తారులే అన్నట్టు ఉండేవారు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళిపోతే వెళ్లిపోని అన్నట్టు ఉండేది ఆయన ఆలోచన. తనకు బీసీలు ఉన్నారని, ఎస్సీలు ఉన్నారని, వారంతా తనకే ఓటు వేస్తారని పెద్ద ఎత్తున కలలు కన్నారు. అంతకుముందు కాపులకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు కల్పించారు చంద్రబాబు. ఆ రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. దీంతో అసలైన రిజర్వేషన్లు ఇస్తారని కాపులు భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వారి గాలిని తీసేశారు. కాపుల కోసం, కాపు నేతల కోసం వైసిపి కాపు నేతలతోనే అమానుషంగా మాట్లాడించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది.. అటువంటి వ్యక్తి ఇప్పుడు కాపుల కోసం మళ్లీ గేమ్ ప్రారంభించారు. అయితే గత అనుభవాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కానీ ప్రయత్నం వదలని విక్రమార్కుడిలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాపుల గురించి ఏ చిన్న అంశం తెరపైకి వస్తున్నా వాలిపోతున్నారు. ఇప్పుడు కృష్ణలంకలో సాయి కృష్ణ ఇంటిపై అలానే వాలిపోయారు.
* శృతిమిస్తున్న ప్రచారం..
సాయి కృష్ణ లాకప్ డెత్ కు గురయ్యారని సాక్షి మీడియా ఒకవైపు రాసేస్తోంది. కనీసం స్మశానంలో ఆడవాళ్లు లేకుండా కాల్చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో శవం అనే మాట వినిపిస్తే అరక్షణం ఆగను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ ఇంటి వద్ద వాలిపోయారు. సాయి కృష్ణ పై కేసులు ఉన్నాయని ఆయన బంధువులే చెబుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం ఆ కేసులను చిన్న నేరాలుగా చూపుతున్నారు. బాధిత కుటుంబంగా సంఘీభావం తెలిపితే పరవాలేదు కానీ.. ఆ తప్పులను సైతం ఒప్పులుగా చూపే అధికారం మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేదు. పోలీసులు ఈ ఘటనలో వ్యవహరించిన తీరు కూడా సహేతుకం కాదు. అలాగని ఇదేదో కాపు రాజకీయం చేసి కాక రేపాలని భావిస్తున్నారు. అసలు పోలీస్ శాఖలో దర్యాప్తులు లేవా? నిందితులు లేరా? వైసీపీ హయాంలో కారు డ్రైవర్ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు ఆయన పార్టీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదా? దళితుల ఆర్తనాదాలు వినిపించలేదా? అర్జెంటుగా ఇప్పుడు కాపులు కూటమికి వ్యతిరేకం కావాలి. పవన్ కళ్యాణ్ కు దూరం కావాలి. ఆ ఆలోచన తప్ప మరొకటి కనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డికి.
