Jagan: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. దీనికి కారణం అక్కడ వరుసగా కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ గెలుస్తూ రావడమే. ఇద్దరూ టిడిపి నుంచి తమ ప్రస్థానాన్ని ప్రారంభించిన వారి. అయితే ఉన్నఫలంగా వారిద్దరూ టిడిపి నాయకత్వంతో పాటు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇద్దరూ ఫైర్ బ్రాండ్లే. చంద్రబాబుతో పాటు లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఒకరు జైలుకు వెళ్లి అనారోగ్యానికి గురయ్యారు. మరొకరు వెళ్లకుండానే ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే ఆ ఇద్దరూ యాక్టివ్ కాకపోవడంతో ఏం చేయాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పాలు పోవడం లేదు.
* నియోజకవర్గానికి దూరంగా..
కొడాలి నాని( Kodali Nani )) 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి గెలిచారు. రెండుసార్లు టిడిపి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మరో రెండు సార్లు వైసీపీ తరఫున గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే వ్యక్తిగత దూకుడుతో వివాదాస్పద ముద్ర తెచ్చుకున్నారు కొడాలి నాని. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి దూరమయ్యారు. అలా అనారోగ్యం బారిన పడ్డారు. అయితే ఇంతవరకు గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ కాలేదు. అలాగని ప్రత్యామ్నాయ నేతను జగన్మోహన్ రెడ్డి నియమించలేదు. కొడాలి నాని విషయంలో వేరే ఆలోచన చేస్తే చెడ్డ పేరు రావడం ఖాయం. అందుకే కొడాలి నాని కోసం జగన్ సైతం ఎదురుచూస్తున్నట్లు అర్థమవుతోంది.
* గన్నవరం లో వంశీ..
మరోవైపు అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. 2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మాత్రం గన్నవరం నుంచి పోటీ చేసి గెలిచారు అసెంబ్లీకి. ఐదేళ్లపాటు చంద్రబాబు నాయకత్వం పట్ల విధేయత గా ఉండేవారు. 2019లో రెండోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అది మొదలు చంద్రబాబుతో పాటు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల్లో చిక్కుకున్నారు. చాలా రోజులపాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికీ వంశి నియోజకవర్గంలో యాక్టివ్ కాలేదు. అలాగని ప్రత్యామ్నాయ నేతకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించలేదు జగన్మోహన్ రెడ్డి.
* టిడిపి ఎమ్మెల్యేల దూకుడు..
అయితే ఈ రెండు చోట్ల టిడిపి కూటమి పట్టు బిగిస్తోంది. రెండు చోట్ల టిడిపికి బలమైన ఎమ్మెల్యేలు ఉన్నారు. దూకుడు ప్రదర్శిస్తున్నారు. వీరి పనితీరు బాగున్నట్లు కూడా నివేదికలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి వీరిద్దరే పోటీ చేయనున్నారు. అందుకే ఈ రెండు నియోజకవర్గాల విషయంలో జగన్మోహన్ రెడ్డి మల్ల గుల్లాలు పడుతున్నారు. వారిని తప్పిస్తే చెడ్డ పేరు వస్తుంది. అలాగని వారు యాక్టివ్ కావడం లేదు. ఈ విషయంలో ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డికి పాలు పోవడం లేదని వైసీపీలో ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..