Jagan gives posts to all YCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)గట్టి వ్యూహంతోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే ఆ పార్టీకి భవిష్యత్. లేకుంటే ప్రమాదంలో పడినట్టే. అందుకే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. వారంలో మూడు రోజులపాటు తాడేపల్లి నివాసంలో గడుపుతున్నారు. నాలుగు రోజులపాటు బెంగళూరులోని ఎలాహంక ప్యాలెస్ లో ఉంటున్నారు. అయితే పక్కా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడం పైనే పూర్తిగా దృష్టిపెట్టారు. ముఖ్యంగా బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో 15వేల మందికి పార్టీ అనుబంధ సంఘాల్లో పదవులు ఇస్తుండడం విశేషం.
నియోజకవర్గంలో 15 వేల పదవులు..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) కార్యవర్గాలు విచిత్రంగా ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రతి నాయకుడికి.. ప్రతి కార్యకర్తకి ఈ అనుబంధ సంఘాల్లో పదవులు దక్కుతున్నాయి. విచిత్రం ఏంటంటే అసలు తమకు పదవులు వచ్చాయన్న విషయం చాలామందికి తెలియదు. 2012లో పార్టీ ఆవిర్భవించింది. ఒకసారి అధికారంలోకి వచ్చింది. రెండుసార్లు ఓడిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో ఓటమితోనే ఆ పార్టీలో మార్పు వచ్చింది. అంతకుముందు పార్టీ కార్యవర్గాలతో పాటు అనుబంధ విభాగాల్లో ఎవరికీ చోటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు పార్టీలో కార్యకర్త నుంచి అధినేత వరకు అందరికీ పదవులు పని చేశారు. అలా పదవులు ఇస్తే పార్టీలో కొనసాగడమే కాకుండా పార్టీ కోసం పని చేస్తారు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన.
ఉగాది నుంచి బస్సు యాత్ర…
అయితే జనంలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ ఉగాది నాటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బస్సు యాత్ర చేపట్టడం ద్వారా ప్రతి కార్యకర్తను కలవవచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అయితే ఇప్పటికే పార్టీ కార్యవర్గాలను ప్రకటించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ సంస్థాగత నిర్మాణాలు పూర్తయ్యాయి. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అయితే ఉగాదికి మరో మూడు వారాలకు పైగా గడువు ఉంది. ఇంతలో వీటి నిర్మాణాలు పూర్తి చేయనున్నారు. పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి పార్టీ పదవులు ఇచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి పర్యటన మరింత సక్సెస్ అయ్యేలా వారు చూస్తారన్నది ఆలోచన. మరి ఈ ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.