Site icon OkTelugu

Byreddy Siddharth Warning to Jagan: జగన్ కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వీట్ వార్నింగ్!

Byreddy-Siddharth-Warning to Jagan

Byreddy-Siddharth-Warning

Byreddy Siddharth Warning to Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు యాక్టివయ్యారు. అయితే సీనియర్లు మాత్రం మౌనంగా ఉన్నారు. జూనియర్ లు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇలా దూకుడు తనం ప్రదర్శిస్తున్న వారిలో కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముందుంటారు. 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ యువనేత ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ అవకాశం కూడా రాలేదు. సొంత నియోజకవర్గంలో నందికొట్కూరు ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆయనకు పోటీ చేసే అవకాశం చిక్కలేదు. కానీ 2029 ఎన్నికల్లో మాత్రం తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని ఆయన జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గ కాకుండా ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే ఛాన్స్ కల్పించాలని పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన వైరల్ గా మారింది. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముంగిట ప్రత్యక్షమయ్యే నాయకులకు అస్సలు ఛాన్స్ ఇవ్వొద్దని ఆయన నేరుగా అధినేత జగన్మోహన్ రెడ్డిని మీడియా ముఖ్యంగా కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బలమైన నేపథ్యం..
బలమైన రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పదునైన మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. నందికొట్కూరు ప్రాంతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాత శేష శయనా రెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఎమ్మెల్యే తో పాటు మంత్రిగా వ్యవహరించారు. మరోవైపు ఆయన వారసుడిగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టిడిపిలో ప్రభావం చూపారు. తర్వాత టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ నుంచి బిజెపిలోకి వచ్చారు. ఇప్పుడు టిడిపి గూటికి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి ప్రస్తుతం నంద్యాల ఎంపీగా ఉన్నారు. అయితే పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో వైసీపీలోకి వెళ్లిన సిద్ధార్థ రెడ్డి మాత్రం అక్కడే ఉండిపోయారు. తనకంటే వెనుక రాజకీయాల్లోకి వచ్చిన అక్క శబరి ఎంపీ అయ్యారు. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మాత్రం ఆ ఛాన్స్ దక్కలేదు.

పోటీ చేసేందుకు ఆసక్తి..
అయితే వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలో దిగాలని భావిస్తున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఆయన కర్నూలు అసెంబ్లీ స్థానంపై దృష్టి పెట్టినట్లు కూడా ప్రచారం నడుస్తోంది. అవసరం అనుకుంటే నంద్యాల లోక్సభ స్థానం నుంచి పోటీకి సిద్ధం అన్నట్లు సమాచారం. కానీ గత మూడు ఎన్నికల్లో వివిధ సమీకరణల పేరు చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. ఈసారి మాత్రం తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు బైరెడ్డి. 2019 ఎన్నికల్లో నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయనకు శాప్ చైర్మన్గా అవకాశము ఇచ్చారు. ఈసారి మాత్రం ఎంపీగా కానీ.. ఎమ్మెల్యేగా కానీ అవకాశం ఇవ్వాల్సిందేనని పరోక్ష సంకేతాలు పంపుతున్నారు బైరెడ్డి. మరి జగన్ ఎలాంటి అవకాశం ఇస్తారో చూడాలి.

Exit mobile version