Site icon OkTelugu

Jagan: జగన్ తుది దశ వ్యూహం

Jagan

Jagan

Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు జగన్ ఏనాడో వ్యూహం ప్రారంభించారు. ఏడాదికి ముందే గడపగడపకు మన ప్రభుత్వం పేరిట వైసీపీ ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజల ముంగిటకు పంపించారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకునేవారు. ఆ సర్వే ఫలితాల్లో వెనుకబడిన వారికి గట్టి హెచ్చరికలు పంపించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలను ఏర్పాటు చేశారు. లక్షల ప్రజలను సమీకరించి సత్తా చాటారు. అటు తరువాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంటు స్థానాల్లో బస్సు యాత్ర పూర్తి చేశారు.

ప్రస్తుతం ప్రచారానికి కేవలం నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈనెల 11తో ప్రచారపర్వం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కూటమి తరుపున చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్, పురందేశ్వరి.. ఇలా అందరూ రంగంలోకి దిగారు. అందరూ కలిసిభారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.అదే సమయంలో ఒంటరిగాను ప్రచారం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కంటే కూటమి ప్రచారం అధికంగా ఉంది. మరోవైపు గత రెండు రోజులుగా బీజేపీ అగ్ర నేతలు వరుసగా క్యూకడుతూ వచ్చారు. మొన్నటికి మొన్న అమిత్ షా వచ్చి వెళ్లారు.నిన్నటికి నిన్న ప్రధాని మోదీ సైతం ప్రచార సభలు నిర్వహించారు.ఈరోజు పీలేరులో భారీ బహిరంగ సభతో పాటు విజయవాడలో ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు.

గతం మాదిరిగా జగన్కు అండగా కుటుంబం లేదు. సినీ గ్లామర్ కూడా పార్టీకి లేదు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. అయితే జగన్ చివరి వ్యూహంఅమలు చేయడం ప్రారంభించారు. రోజుకు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో.. ఎక్కడైతే గెలిచే ఛాన్స్ తక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసి పర్యటిస్తున్నారు. ముఖ్యంగా సన్నిహిత నేతలు, వాయిస్ ఉండే నేతలను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు హెలికాప్టర్లను సిద్ధం చేశారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. ఒకే రోజున వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సభలకు జగన్ హాజరవుతున్నారు. అయితే ఒకవైపు వ్యవస్థల పరంగా జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి, కేంద్రం కూటమికి సంపూర్ణ సహకారం అందిస్తుండడం.. తదితర కారణాలతో మాత్రం జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ తరుణంలోనే తన వ్యూహాలను పదును పెడుతున్నారు. అయితే ఎన్నికల్లో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Exit mobile version