Jagan: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చిన్నపాటి ఊపు కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బిజెపి బలం చాలా తక్కువ. అయితే ఇదే దూకుడుతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొన్ననే కేరళలో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో ఎప్పటినుంచో అధికారంలో ఉంది. మధ్యలో తెలంగాణలో సైతం ఆ పార్టీ సత్తా చాటింది. మొన్నటికి మొన్న తమిళనాడులో విజయ్ సర్కార్ కొలువుదీరడానికి కాంగ్రెస్ కారణం అయింది. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో హవా చాటుకుంది కాంగ్రెస్. ఏపీలో మాత్రం లోటు కనిపిస్తోంది. ఆ లోటు భర్తీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఉంది. అందుకే దాని అడ్డంకి తొలగించేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది.
* కాంగ్రెస్ రూట్ మ్యాప్..
2029 సార్వత్రిక ఎన్నికలకు ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ హై కమాండ్. ఇందులో భాగంగా ఒకప్పుడు కాంగ్రెస్ డిఎన్ఏ నుంచి పుట్టి విడిపోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్ వైపు రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా ఆ ఇద్దరు ట్రబుల్ షూటర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. దక్షిణాదిన కాంగ్రెస్ వ్యూహాలను విజయవంతంగా అమలు చేసే బాధ్యత డీకే శివకుమార్ తో పాటు రేవంత్ రెడ్డికి అప్పగించింది హై కమాండ్. ఇప్పటికే బెంగాల్ లో ఓడిపోయిన మమతా బెనర్జీ కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురయ్యేలా ఉంది.
* జగన్ కు అవసరం
వరుసగా ఎన్నికల్లో ఓటమితో ఒంటరివాడు అయ్యారు జగన్మోహన్ రెడ్డి. జాతీయస్థాయిలో ఒక బలమైన రక్షణ వలయం, రాజకీయ తోడ్పాటు అవసరం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమిని ఢీకొట్టాలంటే జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ అండ జగన్మోహన్ రెడ్డికి అవసరం. ఆపై పొరుగు రాష్ట్రాల ప్రభావం ఏపీ పై స్పష్టంగా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. తోటి తెలుగు రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు సాయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే కెసిఆర్ లేకపోతే ఏ పరిస్థితి వచ్చిందో 2024 ఎన్నికల్లో కనిపించింది. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఆకర్షించేందుకు రేవంత్ గట్టి ప్రయత్నాలు ఉన్నట్లు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో మునుపటి వైఖరి అనుసరించడం లేదు రేవంత్. దీని వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉన్నట్లు స్పష్టం అవుతుంది. మరి డీకే శివకుమార్ గురించి చెప్పనవసరం లేదు. వైయస్ కుటుంబంతోపాటు జగన్మోహన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు కూడా. సో వచ్చే ఎన్నికల నాటికి జగన్ కాంగ్రెస్ వైపు రావడం ఖాయం.

