Jagan Car police Report: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్త సింగయ్య మృతికి సంబంధించి గత కొద్ది రోజులుగా రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందారు. అయితే తొలుత ఆయన గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉంటారని గుంటూరు పోలీసులు ధృవీకరించారు. అయితే కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కిందపడి సింగయ్య నలిగిపోయినట్లు ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోలో ఆధారాలను బట్టి జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందాడని పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. ఇందులో వాహన డ్రైవర్ రమణారెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డి పై సైతం కేసులు నమోదయ్యాయి. జగన్ పిఎ నాగేశ్వర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినిల పై కేసులు నమోదు అయ్యాయి.
Also Read: YS Jagan plan against TDP in 2025: మారిన జగన్ వ్యూహం!
క్వాష్ పిటిషన్ పై విచారణ..
అయితే తమపై రాజకీయ కక్షపూరితంగా కేసులు నమోదు చేశారంటూ వారంతా హైకోర్టును( High Court) ఆశ్రయించారు. కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈరోజు ఆ పిటిషన్లు విచారణకు వచ్చాయి. అదే సమయంలో పూర్తిస్థాయి వివరాలు పొందుపరిచేందుకు తమకు సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. దీంతో ఈ కేసు విచారణను జూలై ఒకటికి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు వారిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులు నమోదైన వారికి స్వల్ప ఊరట దక్కినట్లు అయ్యింది.
వాహనానికి ఫిట్నెస్ పరీక్ష
అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు. మరోవైపు సీజ్ చేసిన వాహనాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆరోజు జగన్ వాడిన ఏపీ 40 డి హెచ్ 2349 వాహనం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. అయితే కేసు విచారణ మరోసారి వాయిదా పడడం.. వివరాలు పొందుపరిచేందుకు పోలీసులకు సమయం దొరికింది. దీంతో జగన్మోహన్ రెడ్డి వాహనం ఫిట్నెస్ ను ఈరోజు రవాణా శాఖ పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రవాణా శాఖ అధికారి గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. జూలై 1న జరిగే విచారణలో నేరుగా ఫిట్నెస్ కు సంబంధించి నివేదిక అందించనున్నారు రవాణాశాఖ అధికారులు.
Also Read:
ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు
అయితే పక్కా ఆధారాలతో జగన్మోహన్ రెడ్డిని ఇరికించేందుకు పోలీసులు( AP Police) పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తగిన సమయం కావాలని వారు కోరారు. కోర్టు సైతం జూలై 1న విచారణ చేపట్టేందుకు నిర్ణయించడంతో.. ఆ వాహనానికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. అయితే పోలీసులు కోరడంతోనే కోర్టు విచారణను వాయిదా వేసింది. కానీ అప్పటివరకు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతరులపై తొందరపాటు చర్యలు వద్దు అని ఆదేశించడం ద్వారా.. వారికి ఊరట ఇచ్చినట్లు అయ్యింది.