AP constituency increase: ఏపీకి( Andhra Pradesh) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నియోజకవర్గాల పునర్విభజనపై సంకేతాలు పంపింది. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పునర్విభజనకు సంబంధించి బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలో అసెంబ్లీ సీట్లు మరో 50 పెరిగే అవకాశం ఉంది. ఏడు పార్లమెంట్ స్థానాలు సైతం పెరగనున్నట్లు తెలుస్తోంది.. నియోజకవర్గాల పెంపు అనేది రాష్ట్ర విభజన సమయంలోనే ప్రస్తావనకు వచ్చింది. విభజన చట్టంలోనే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాజకీయ అవకాశాలు పెంచుతామని స్పష్టంగా చెప్పారు. పాలనా వికేంద్రీకరణకు నియోజకవర్గాల పెంపు చేపడతామని చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు.
మారనున్న లెక్క..
ప్రస్తుతం రాష్ట్రంలో 175 అసెంబ్లీ… 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు.. 117 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే పునర్విభజనతో అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో అధికార పార్టీకి అనుకూలంగా ఈ ప్రక్రియ జరిగింది అనేది ఒక విశ్లేషణ. 2004లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనతో టిడిపికి బలమైన స్థానాలను… విభజించి బలహీనపరిచారు అన్నది ఒక ఆరోపణ. ఇప్పుడు కూడా టిడిపి కూటమి రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో టిడిపి బలమైన భాగస్వామ్య పక్షంగా ఉంది. ఇప్పుడు గాని నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన నియోజకవర్గాలు తారుమారు అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
కూటమికి లాభం
మొన్నటి ఎన్నికల్లో జనసేన 21, బిజెపి 10, మిగిలిన స్థానాల్లో టిడిపి పోటీ చేసింది. అయితే 164 సీట్లలో కూటమి గెలిచింది. అయితే పొత్తులో భాగంగా ఓ 50 మంది నేతలు తమ సీట్లను త్యాగం చేశారు. టిడిపిలో ఇటువంటి వారి సంఖ్య అధికంగా ఉంది. మరోవైపు జనసేనతో పాటు బిజెపిలో సైతం చాలామంది ఎమ్మెల్యే సీట్ల ఆశావాహులు ఉన్నారు. ఎన్నికలకు ముందు, తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపి కూటమిలో చాలామంది నేతలు చేరారు. ఇప్పుడు వారందరికీ రాజకీయ అవకాశాలు కల్పించడం అనేది కష్టం. ఇటువంటి సమయంలో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా 50 అసెంబ్లీ స్థానాలు, ఏడు పార్లమెంటు సీట్లు పెరిగితే మాత్రం కూటమికి ప్లస్ గా మారుతుంది. ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన నియోజకవర్గాలు.. విభజనతో మరింత బలహీనమవుతాయి. ఇలా ఎటు చూసుకున్నా నియోజకవర్గాల పునర్విభజనతో టిడిపి కూటమికి ఎక్కువగా మేలు జరుగుతుంది.