Jagan part time politics: రాజకీయాలు ఒక వృత్తి. ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే దానికి ఒక గుర్తింపు ఉంటుంది. అధికారానికి చేరువ కాగలం. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో పొలిటికల్ ట్రెండ్స్ చూస్తుంటే ఎప్పటికప్పుడు మార్పులు కనిపిస్తున్నాయి. అయితే దానిని అందుకుంటేనే అనుకున్నది సాధించగలం. విజయ్ రెండు సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేశారు. అంతకంటే ముందే మరో సీనియర్ నటుడు కమల్ హాసన్ సైతం పార్టీని ఏర్పాటు చేశారు. అయితే విజయ్ అంత దూకుడుగా వ్యవహరించలేదు. సినిమాలను పక్కనపెట్టి రాజకీయాలపైనే పూర్తిగా దృష్టిపెట్టారు విజయ్. జీవన్మరణ సమస్య అన్నట్టు పోరాటం చేశారు. అనుకున్నది సాధించగలిగారు. పశ్చిమ బెంగాల్లో బిజెపి నేతలు చేసింది కూడా అదే. ఫుల్ టైం రాజకీయాలు చేసి అక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా ఉన్నారు. ఒకసారి అధికారం చేపట్టి దానికి దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఫుల్ టైం పాలిటిక్స్ చేయడం లేదు. వీకెండ్ పాలిటిక్స్ కు పరిమితం అవుతున్నారు.
అప్పట్లో వారికి రాజకీయాలే ఊపిరి..
2019 నుంచి 2024 మధ్య టిడిపి తో పాటు జనసేన విపక్షంలో ఉంది. ఆ సమయంలో చంద్రబాబు రాజకీయాలంటే ఒక ఊపిరిగా పనిచేశారు. లోకేష్ సైతం రాజకీయాలను ఒక వృత్తిగా భావించారు. పవన్ కళ్యాణ్ సైతం రోజువారి జరిగే పరిణామాలపై కూడా స్పందించేవారు. ఆ ముగ్గురితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేనిపై స్పందిస్తున్నారు. అలాంటి రాజకీయాలు చేస్తున్నారా? కనీసం ఏ అంశం పైన స్పందిస్తున్నారా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. ఎంతవరకు తన పార్టీపై పగ తీర్చుకుంటున్నారు. ప్రతీకార కేసులు పెడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. సమకాలిన అంశాలపై ఆయన స్పందించడం లేదు. జనాల్లోకి వచ్చి తిరగడం లేదు. జనాల సమస్యలను మరింత గట్టిగా అడగడం లేదు. బెంగళూరులో నాలుగు రోజులు.. తాడేపల్లిలో రెండున్నర రోజులు గడిపేసి వెళుతున్నారు. కళ్ళు మూసుకుంటే రెండేళ్లు దాటిపోయాయి. మరో మూడేళ్లు దాటి పోతే మన ప్రభుత్వం వచ్చేస్తుంది అని చెబుతున్నారు. ఫుల్ టైం రాజకీయాలు చేయకుండా పార్ట్ టైం రాజకీయాలకు పరిమితం అవుతున్నారు.
ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయాయి. ఇదో ట్రెండ్ నడుస్తోంది. అయితే అధికార పార్టీలు ఏదో ఈజీగా ఓడిపోలేదు. అక్కడ విపక్షాలు గట్టి ప్రయత్నాలు చేశాయి. దానిపై సత్ఫలితాలు వచ్చాయి. ఈ ట్రెండ్ను ఇలానే కొనసాగించాలి అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని భావన కలిగించాలి. కానీ ఎందుకు ఆయన జనం మధ్యకు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. అన్నింటికీ 2027 పాదయాత్రను చూపిస్తున్నారు. అయితే 2017 పాదయాత్ర ఒక ఎత్తు.. ఇప్పుడు ఒక ఎత్తు. ఎందుకంటే అప్పుడు అధికారంలో అంతకు ముందు లేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పాలించారు. అందుకే పాదయాత్ర పై కూడా అంతగా నమ్మకం పెట్టుకోకూడదు. అంతకుమించి పార్ట్ టైం రాజకీయాలు చేయకూడదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇష్టం.