Good news for Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ కు ( Andhra Pradesh) కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే పరంగా మరో శుభవార్త అందింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు అవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1న కొత్త రైల్వే జోన్ కు సంబంధించి అప్పాయింటెడ్ డే గా గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఈ నెల చివర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరనుంది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే విభజన ప్రక్రియలో భాగంగా.. ఆరు డివిజన్లు విడిపోనున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఈ దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు కానుంది. విభజన హామీల్లో భాగంగా ఈ రైల్వే జోన్ హామీ ఇచ్చారు. ఎట్టకేలకు ఆ కళా నెరవేరనుంది.
విభజన హామీగా.
ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ( South Central Railway zone) కొనసాగింది. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి రైల్వే జోన్ ఇస్తామని అప్పట్లో పేర్కొన్నారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కదలిక వచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించింది. అందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. దక్షిణ మధ్య రైల్వే జోన్ లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లను కొనసాగించి.. మిగతా వాటిని దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తూర్పు కోస్తా జోన్లో కొంత భాగంతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు కలిపి దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో కలవనున్నాయి. దశాబ్ద కాలంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర క్యాబినెట్ కొత్త రైల్వే జోన్ కు ఆమోదం తెలిపింది. కొత్త రైల్వే జోన్ కు సీఎంతో పాటు అవసరమైన అధికారులను నియమించింది. జోన్ కు సంబంధించి చేర్పులు మార్పులు, సరిహద్దులు వంటివి కూడా పూర్తయ్యాయి. కానీ గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. అది వస్తేనే అధికారికంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. మొన్ననే సీఎం చంద్రబాబు ఇదే అంశంపై రైల్వే శాఖ మంత్రి తో ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో సూత్రప్రాయంగా దీనిపై కేంద్ర రైల్వే శాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు..
విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ( South coastal railway zone) జిఎం తాత్కాలిక కార్యాలయాన్ని.. సిరిపురం లో ఉన్న డెక్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ రెండు అంతస్తులను లీజు కిందకు తీసుకున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ శాశ్వత ప్రధాన కార్యాలయం పనులు కూడా వేగవంతం అయ్యాయి. మూడసర్లోవలో ఏపీ సర్కార్ భూమిని కేటాయించగా.. అక్కడ పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పనులకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. మొత్తం 54 ఎకరాలను కార్యాలయం కోసం కేటాయించారు. 192 కోట్లతో పరిపాలన భవనానికి ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 12 అంతస్తుల్లో ఈ భవన నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్ర రైల్వే శాఖ సిద్ధపడుతోంది. ఉత్తరాంధ్ర వాసులకు ఇది నిజంగా శుభవార్త.