Good News for North Andhra: ఏపీకి( Andhra Pradesh) మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. విశాఖ కేంద్రంగా దక్షిణ మధ్య తీర రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విభజన హామీల్లో భాగంగా ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ పాలనాపరమైన అనుమతులు ఇప్పటికే జారీ చేసింది రైల్వే శాఖ. ఇప్పుడు అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించే వీలుగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది శుభవార్త. ఎందుకంటే పుష్కర కాలానికి పైగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఇది సానుకూల అంశం.
విభజన హామీల్లో భాగంగా..
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఏపీకి కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తామని విభజన చట్టంలోనే పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. కానీ తర్వాత వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే జోన్ కు సంబంధించి భూముల కేటాయింపులో తీవ్ర జాప్యం చేసింది. దీంతో రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఆలస్యం అయ్యింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది. రైల్వే జోన్ కు అవసరమైన భూములను అప్పగించింది. తాత్కాలిక భవనాలను కేటాయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా.. దక్షిణ మధ్య తీర రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి అనుమతులు మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే జోన్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. కానీ ఈ జూన్ ఒకటి నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి కొత్త జోన్ పరిధిలో..
కొత్తగా ఆ డివిజన్లతో..
విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు అవుతున్న జోన్లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడతోపాటు విశాఖ డివిజన్ లను కలపనున్నారు. ఇప్పటికే వాల్తేరు డివిజన్ ఉండగా దానిని రద్దు చేశారు. కొంత భాగాన్ని విజయవాడ జోన్లో చేర్చారు. మరికొంత భాగంతో విశాఖ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు కొత్త డివిజన్లో చాలా రైల్వేస్టేషన్లను విశాఖ డివిజన్లో చేర్చగా.. గతంలో వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న స్టేషనులు కొన్ని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న కొత్త డివిజన్ లో చేర్చారు. ఇప్పుడు అధికారికంగా గెజిట్ రావడంతో విశాఖ నుంచి కొత్త రైల్వే సర్వీసులు, నూతన ఉద్యోగ నియామకాలు, అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. నిజంగా ఇది శుభవార్త ఉత్తరాంధ్ర ప్రజలకు.