Former Union Minister to Join YCP: రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు జగన్. ఈనెల 15 తర్వాత ఏపీకి రానున్నారు. వచ్చిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పర్యటనల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటన మొదలుపెట్టనున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి ప్రారంభం కానుంది జగన్ పర్యటన. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో నేరుగా మాట్లాడతారు. వారి అభిప్రాయాలను తీసుకుంటారు. నేతల విషయంలో ఫీడ్ బ్యాక్ సైతం ఉంటుంది. పనిలో పనిగా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల ఖరారు కూడా జరుపుతారని ప్రచారం సాగుతోంది. మూడేళ్ల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తే గెలుపు గుర్రాలు అవుతారని భావిస్తున్నారు అట. ఈ క్రమంలో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరు ఖరారు చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్లో..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కిల్లి కృపారాణి. మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆమె వైసీపీ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో కృపారాణిది ఒక చరిత్ర. ఒక సాధారణ వైద్యురాలిగా ఉన్న ఆమె 2003లో రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా 2004 ఎన్నికల్లో పోటీ చేశారు. ఎర్రం నాయుడు చేతిలో ఓడిపోయారు. 2009లో అదే ఎర్రం నాయుడు పై గెలిచి జైంట్ కిల్లర్ గా నిలిచారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం కూడా దక్కించుకున్నారు. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నేతలంతా వెళ్లిపోయారు. కానీ కృపారాణి మాత్రం అదే కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు.
ఎన్నో రకాల ప్రయోగాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం పార్లమెంటు సీటు ఆ పార్టీకి చిక్కలేదు. 2014 ఎన్నికల్లో అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత రెడ్డి శాంతిని ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు చేతిలో ఆమెకు ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ను ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా వర్కౌట్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచింది.. కానీ ఇక్కడ మాత్రం రామ్మోహన్ నాయుడు రెండోసారి గెలిచారు. 2024 ఎన్నికల్లో పేరాడ తిలక్ ను ప్రయోగించారు జగన్. ఈ నిర్ణయం అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. రామ్మోహన్ నాయుడు ఘన విజయం సాధించడంతో కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కీలకమైన పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయనను ఓడించాలి అంటే ఒక సీనియర్ నేత అవసరం. అందుకే కిల్లి కృపారాణిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసమే కృపారాణి వైసీపీలో చేరారు. కానీ జగన్ మొండి చేయి చూపడంతో ఆవేదనతో బయటకు వెళ్లిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు జగన్ పిలిచినా ఆమె వస్తారా? రారా? అన్నది తెలియాల్సి ఉంది.