AP new cabinet reshuffle: రాజకీయాలు అన్నాక రకరకాల రూమర్లు వస్తుంటాయి. ముఖ్యంగా సర్వే సంస్థలు కొన్ని అంచనాలు వెల్లడిస్తుంటాయి.. అయితే అలా ఫలితాలు విడుదల చేసిన సర్వే సంస్థల విశ్వసనీయత బట్టి అవి ఆధారపడి ఉంటాయి. నమ్మాలా వద్దా అనేది ఎదుటి వ్యక్తి నమ్మకం బట్టి ఉంటుంది. అయితే తాజాగా సర్వేలు నిర్వహించే రైజ్ సంస్థ నిర్వాహకుడు ప్రవీణ్ పుల్లట( Praveen pullata ) రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగాదికి కానీ.. తరువాత కానీ మంత్రివర్గ విస్తరణ ఖాయమని చెబుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి ఓ ఐదుగురిని తీసుకోవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. ఆయన పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. విపరీతంగా వైరల్ అవుతుంది.
2024 జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు( CM Nara Chandrababu) నాయుడు, ఓ 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. పవన్ కళ్యాణ్ కీలకమైన నాలుగు శాఖలకు మంత్రి బాధ్యతలు తీసుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం హోదా కూడా తీసుకున్నారు.. అయితే ఖాళీగా ఉన్న మంత్రి పదవి ఎమ్మెల్సీ నాగబాబుతో భర్తీ చేయనున్నారు. అదే సమయంలో కొత్తగా ఓ ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ప్రవీణ్ పుల్లట ఇదే విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ బెందాళం అశోక్, పల్లా శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, వేమిరెడ్డి లను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని డాక్టర్ ప్రవీణ్ పుల్లట వెల్లడించారు.
ఇందులో శ్రీకాకుళం( Srikakulam) జిల్లాకు చెందిన బెందా ళం అశోక్ ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. సౌమ్యుడుగా పేరు ఉంది. ఈసారి ఆయనకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఒకవైపు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు శ్రీనివాస్. మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించిన చివరి నిమిషంలో రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించారు. విస్తరణలో ఆయనకు తప్పకుండా ఛాన్స్ ఇస్తారని ప్రవీణ్ పుల్లట చెబుతున్నారు. అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు సైతం ఛాన్స్ ఉండనుంది. ఇప్పటికీ ఆయన సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. గతంలో మంత్రి పదవి చేపట్టారు. మరోవైపు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ఛాన్స్ ఇస్తారని చెబుతున్నారు. ఆయన చంద్రబాబుతో పాటు లోకేష్ కు సన్నిహితుడు. పార్టీకి విలువైన సేవలు అందించారు. మరోవైపు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఛాన్స్ తప్పకుండా దక్కుతుందని చెబుతున్నారు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు. ఎన్నికలకు ముందు తన భార్యతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రవీణ్ పుల్లట చెప్పుకొస్తున్నారు. గతంలో ఎన్నికలకు ముందు టిడిపి కూటమికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చారు ప్రవీణ్ పుల్లట. అవి నిజమని తేలాయి. అందుకే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఆయన మాటలు.