Homeఆంధ్రప్రదేశ్‌CM YS Jagan - PM Modi : ఎన్నికలొచ్చాయ్.. ఏపీ పొలంలోకి డబ్బులొచ్చాయి.. జగన్...

CM YS Jagan – PM Modi : ఎన్నికలొచ్చాయ్.. ఏపీ పొలంలోకి డబ్బులొచ్చాయి.. జగన్ కు 10వేల కోట్లు ఇచ్చిన మోడీ

CM YS Jagan – PM Modi : ఎన్నికల వేళ ఏపీలో విపక్షాల నోటిలో పచ్చి వెలక్కాయి పడింది. ఆర్థిక ఇబ్బందులతో పథకాలు నిలిపివేసి జగన్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటారని భావించాయి. కానీ అనూహ్యంగా మోడీ సర్కారు జగన్ కు ఆర్థిక దన్ను ఇచ్చింది. గో హెడ్ అంటూ భుజం తట్టి ప్రోత్సహించింది. ఏకంగా రూ.10 వేల కోట్ల సాయం ప్రకటించింది. ఆర్థికంగా భారీ ఊరటనిచ్చింది. ఈ అకాల చర్య జగన్ సర్కారులో సంతోషం నింపగా.. విపక్షాలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. వైసీపీ సర్కారుకు కేంద్రం వెన్నుదన్నుగా నిలవడంపై అగ్గిమీద గుగ్గిలమవతున్నాయి. ఈ చర్యలను తప్పుపడుతూ అప్పుడే ఎల్లో మీడియా ప్రచారం మొదలుపెట్టేసింది.

గ‌తంలో చంద్రబాబు ఎన్‌డీఏ భాగ‌స్వామిగా ఉంటూ కూడా కేంద్రం నుంచి రెవెన్యూ ఆర్థిక లోటు నిధుల్ని రాబ‌ట్ట‌లేక‌పోయారు. అది ముమ్మాటికీ ఆయన ఫెయిల్యూర్. ఇప్పుడు ఎన్టీఏలో భాగస్వామి కానప్పటికీ అంతకు మించి ప్రయోజనాన్ని ఏపీ సీఎం జగన్ పొందారు. అయితే విపక్షం కానీ.. మీడియా కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. కేవలం పెద్దన్న పాత్రలో ఉన్న కేంద్రం తన వంతుగా సాయం చేసింది. అయితే ఈ సాయం లోటు భర్తీకి వినియోగిస్తారా? లేక సంక్షేమ పథకాలకా? అన్నది ఫోకస్ చేయాల్సిన అవసరం కేంద్రంపై ఉంది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు జ‌గ‌న్ సర్కార్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊప‌రి తీసుకోడానికి ఈ నిధులు వెసులబాటు కల్పిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు..

వాస్తవానికి జగన్ సర్కారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. చివరి ఏడాది కావడంతో పథకాలు సక్రమంగా అమలు జరగక నిలిచిపోతే ప్రజల్లో వైసీపీ సర్కారు అబాసుపాలవుతుందని ఆశించారు.  ఇటువంటి సమయంలో ప్ర‌తిప‌క్షాల‌కు కేంద్ర ప్ర‌భుత్వ ఆర్థిక సాయం కోపం తెప్పిస్తోంది. బీజేపీతో వైసీపీ అనుబంధాన్ని మ‌రోసారి ఈ ఎపిసోడ్ నిరూపిస్తోంద‌ని ఎల్లో మీడియా అప్పుడే కూడై కూస్తోంది. ఇదంతా చంద్రబాబు హయాంలోని రెవెన్యూ లోటు అని చెప్పుకొస్తోంది. 2014, 15 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద రూ.10,460.87 కోట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చింది. ప్ర‌త్యేక సాధార‌ణ ఆర్థిక సాయం కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక‌శాఖ (వ్య‌య) అసిస్టెంట్ డైరెక్ట‌ర్ మ‌హేంద్ర చండేలియా ఆదేశాలు ఇవ్వ‌డం విశేషం.

అయితే ఈ నిధులతో రెవెన్యూ లోటును భర్తీ చేసుకుంటారా? అంటే సమాధానం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి లెక్కకు మించి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి.  చిన్నాపెద్దా ప‌నులు చేసి, బిల్లుల కోసం మూడేళ్లుగా అధికార పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో క్షేత్ర‌స్థాయిలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేసి, అండ‌గా నిలిస్తేనే మ‌రోసారి జ‌గ‌న్ కోసం ప‌ని చేసే అవ‌కాశం వుంది. లేదంటే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌ని చేసి, ప్ర‌త్య‌ర్థుల‌కు అండ‌గా నిలిచే ప్ర‌మాదం వుంది. అందుకే అటు సంక్షేమ పథకాలకు, ఇటు అభివృద్ధి పనులకు సమపాళ్లలో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇది విపక్షాలకు మింగుడుపడడం లేదు. కేంద్ర ప్రభుత్వ చర్యలను విపక్షాలు, ఎల్లో మీడియా తప్పుపట్టడం ప్రారంభించాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version