Dana Cyclone Effect: రాష్ట్రం వైపు తుఫాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ వాయువ్య దిశగా పయనిస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు వస్తోంది.తుఫాను ప్రభావంతో గురువారం రాత్రి నుంచి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర పై చూపనుంది. దీంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు. బుధవారం ఉదయానికి ఇది తుఫాన్ గా బలపడింది. గురువారం రాత్రి కానీ.. శుక్రవారం తెల్లవారుజామున కానీ.. ఉత్తర ఒడిస్సా లోని భిటార్కనిక, దమ్రా సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
* తీరం దాటే సమయంలో భీభత్సం
తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో.. అప్పుడప్పుడు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. తీరంలో అలలు రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిస్సా తీరప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని.. వర్షం భారీ బీభత్సం సృష్టించనుందని అంచనా వేస్తున్నారు. భారీగా వరద ముంపు తో పాటు రవాణా, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.
* రైళ్ల రద్దు
భారీ వర్షాల నేపథ్యంలో పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. తూర్పు కోస్తా తో పాటు ఆగ్నేయ రైల్వే లైన్ పరిధిలో అనేక రైళ్లను రద్దు చేశారు. దాదాపు బంగాళాఖాతంలో తీ ర ప్రాంతం వెంబడి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. వేట విషయంలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర పై పడే అవకాశం ఉంది. అయితే ఒడిస్సాలో తీరం దాటుతుండడంతో ఏపీకి పెను ప్రమాదం మాత్రం తప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ లపై ప్రభావం ఉండనుంది. దీంతో ఆ మూడు జిల్లాల తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. జిల్లా యంత్రాంగాలు సైతం అన్ని ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నాయి.