Chandrababu Naidu Rajya Sabha Selection: ఏపీలో రాజ్యసభ లెక్క తేలింది. టిడిపి నుంచి ముగ్గురు.. జనసేన నుంచి ఒకరు ఖరారు అయ్యారు. టిడిపి నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేరు ఖరారు చేశారు. వారు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాజ్యసభ స్థానాలకు సంబంధించి టిడిపి నుంచి ఉత్కంఠకు తెరదించుతూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కసరత్నం ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్లకు సంబంధించి చివరి రోజు కావడంతో టిడిపి నేతల నడుమ ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేస్తారని తెలుస్తోంది.
* పక్కాగా లెక్కలతో..
టిడిపి అధినేత చంద్రబాబు రాజ్యసభ ఎన్నికలో పక్కా వ్యూహం అమలు చేసినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, ప్రాంతాలవారీగా బ్యాలెన్స్ చేయడం, పార్టీకి ఉన్న నమ్మకమైన కేడర్ కు ప్రాధాన్యత ఇవ్వడం అనే అంశాల ఆధారంగా ఈ ముగ్గురి ఎంపిక జరిగింది. కాపు బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూనే.. విద్యారంగంలో గుర్తింపు ఉన్న వ్యక్తులకు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన యువనాయకత్వానికి ఈసారి పెద్దపీట వేశారు. బిజెపి, జనసేన నాయకత్వంతో మాట్లాడిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఎంపిక వెనుక పార్టీ పట్ల విధేయత దాగి ఉంది. ముఖ్యంగా ముగ్గురు నారా లోకేష్ కు అత్యంత సన్నిహితులు కావడం విశేషం.
* మరోసారి కొనసాగింపు..
సానా సతీష్ కు మరోసారి కొనసాగింపు లభించింది. గత కొంతకాలంగా పార్టీలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. పారిశ్రామిక వ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది. నిత్యం నారా లోకేష్ వెంట ఉండేవారు. ఆయన పాదయాత్ర చేసిన సమయంలో కూడా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. భాష్యం రామకృష్ణ తెర వెనుక రాజకీయ సేవలు అందిస్తూ వచ్చారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సహకారం అందించారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారు. కానీ వీలు పడలేదు. రాజ్యసభ పదవి దక్కింది. ఇక చింతకాయల విజయ్ గురించి చెప్పనవసరం లేదు. తండ్రి మాదిరిగానే దూకుడు కలిగిన నేత. ఐటీడీపీకి విశేష సేవలు అందించారు. ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా యువతకు, పార్టీ నమ్మకస్తులకు చంద్రబాబు సరైన గుర్తింపు ఇచ్చారని చర్చ జరుగుతోంది.
* యువతకు ప్రాధాన్యం..
ఈ ముగ్గురి ఎంపిక వెనుక ఉన్న అసలు వ్యూహం లోకేష్. పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మొన్న పొలిట్ బ్యూరోతో పాటు అన్ని రకాల కార్యవర్గాల్లో యువతను నియమించారు. ఇప్పుడు రాజ్యసభలో సైతం ఈ ముగ్గురు యువ నాయకులను తీసుకున్నారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నియామకం చేపట్టారు. ఉత్తరాంధ్ర నుంచి విజయ్ ను తీసుకోవడం విశేషం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, యువనేత కావడంతో చివరి నిమిషంలో ఆయన వైపు మొగ్గు చూపారు చంద్రబాబు. మొత్తానికి అయితే సుదీర్ఘ కసరత్తు తరువాత చంద్రబాబు రాజ్యసభ సభ్యులను ఎంపిక చేయడం విశేషం.
