Chandrababu: వాడు రంగంలోకి దిగనంతవరకే.. పవర్ ఫుల్ డైలాగ్ ఇది సినిమాల్లో. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును చూస్తే అదే అర్థం అవుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీని సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ కుదిపేస్తోంది. దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. లా అండ్ ఆర్డర్ తో కూడుకున్నది ఈ వ్యవహారం. కేసుల విచారణలో భాగంగా పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అటు తరువాత ఆ యువకుడి ఆచూకీ లేదు. ఇటువంటి సమయంలో కుమారుడి కోసం ఆరాటపడుతున్న ఆ తల్లిని, కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకోవాలి. వారి వైపు న్యాయం జరిగేలా చూడాలి. ఇప్పుడు చంద్రబాబు చేసింది అదే. బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడారు. తప్పకుండా తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ తల్లిని ఓదార్చారు. దీంతో ఆ కుటుంబం మనసు నిండా ఉన్న బాధ కొంతవరకు తీరింది.
* కాపు అనే మాట హైలెట్..
ఇదే విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. అంతకుముందు ఆ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయమని అడిగే కంటే.. ఆ యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడని… కూటమికి కాపులు ఓట్లు వేస్తే వారే బాధితులు అవుతున్నారని.. లాకప్ డెత్ చేసేసారని.. కనీసం మృతదేహం అయిన ఇప్పించాలని ఏవేవో మాటలు అనేశారు. దీనిని పరిశీలించకుండానే జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ కుర్రాడు చేసిన నేరాలను ప్రస్తావిస్తూ అవి చిన్న చిన్నవి అంటూ.. ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన సైతం కూటమి ప్రభుత్వంపై బురదజల్లేసారు. ఏదో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఆ యువకుడు సాయికృష్ణను అరెస్టు చేయించి ఇబ్బంది పెట్టారు అన్నట్టు మాట్లాడారు. కానీ చంద్రబాబు ఆలోచన మాత్రం అలా లేదు. ఆయన తన చతురతతో పాటు బాధిత కుటుంబం పై చూపిన శ్రద్ధ, మానవీయ కోణం మరువరానిది. ఈ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్నారో.. ఆ కుటుంబ సభ్యులే సంతృప్తికరంగా.. సీఎం చంద్రబాబు చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.
* చంద్రబాబు రావడంతో మారిన సీన్..
గత మూడు రోజులుగా ఏపీని కుదిపేసింది సాయి కృష్ణ అదృశ్యం ఎపిసోడ్. ఇది పూర్తిగా పోలీస్ శాఖ పరిధిలోనిది. పైగా సాయి కృష్ణ పై అనేక కేసులు ఉన్నాయి. సాధారణంగా ఈ కేసుల దర్యాప్తులో భాగంగా పోలీస్ విచారణ అనేది కామన్. అయితే దానిని రాజకీయ దూర దృష్టితో చూసేసారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అదృశ్యమైంది కాపు యువకుడు కాబట్టి ఇదో రాజకీయ అస్త్రం అవుతుందని భావించారు. ఒక మరక చల్లే ప్రయత్నం చేశారు. అప్పుడు చంద్రబాబు రాష్ట్రంలో లేరు. సింగపూర్ లో ఉన్నారు. అక్కడి నుంచి రాష్ట్రానికి నేరుగా వచ్చి ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిజిపితో పాటు ఉన్నతాధికారులతో చర్చించారు. కృష్ణలంకలో సాయి కృష్ణ నివాసానికి స్థానిక ఎమ్మెల్యేను పంపించారు. ఆ కుటుంబ సభ్యులను సచివాలయానికి తీసుకొచ్చి వారి సమస్యను విన్నారు. అసలేం జరిగింది? అనే విషయాన్ని ఆరా తీశారు. సాయి కృష్ణ ను అరెస్ట్ చేసిన సీఐ ను సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసును కూడా నమోదు చేశారు. ఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేపడుతున్నారు. సాయి కృష్ణ తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. మీరు అనుమానిస్తున్నట్టు అన్యాయం జరిగి ఉంటే న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కాపు సామాజిక వర్గం అన్న విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు మాత్రం పరిష్కార మార్గం చూపిస్తానన్నారు. దీంతో నిన్నటి వరకు తమకు అన్యాయం జరిగిందన్న బాధతో ఉన్న ఆ బాధ్యత కుటుంబం కొంత తేలికపడింది. చంద్రబాబుతో కలిసిన తరువాత కొంత స్వాంతన చేకూరింది. మాకు ఈ కులాలు వద్దు.. రాజకీయాలు వద్దు.. కావాల్సింది న్యాయం.. తెలియాల్సింది వాస్తవం అన్నట్టు.. బాధిత కుటుంబం చెప్పడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు నీరు గారి పోయాయి.
