Andhra Pradesh Rajya Sabha Elections: ఏపీలో ( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్లో రాష్ట్రానికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎన్నికకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. కూటమి ఏకపక్షంగా బలంగా ఉండడంతో.. ఈ నాలుగు స్థానాలను దక్కించుకోనుంది. అయితే తెలుగుదేశం పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు విడిచి పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పదవీ విరమణ చెందుతున్న వారిలో టిడిపికి చెందిన సానా సతీష్ ఉన్నారు. ఆయనకు మరోసారి రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఏడాది కిందట రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మిగతా మూడు పదవులను మాత్రం కూటమి పార్టీలు చెరో పదవి దక్కించుకునే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒకటి, జనసేనకు ఒకటి, బిజెపికి ఒకటి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేనకు తొలిసారి రాజ్యసభ ప్రాతినిథ్యం దక్కనుంది. బిజెపికి ఇప్పటికే ఒకసారి చాన్స్ దక్కింది. అయితే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడంతో రాజ్యసభ పదవి కోరుకుంటూ వస్తోంది.
* గతసారి కృష్ణయ్యకు..
గతసారి రాజ్యసభ ఎన్నికల సమయంలో బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది బిజెపి. అందుకే తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభకు పంపించింది. తెలంగాణలో బీసీల సంఖ్య అధికం. కృష్ణయ్యకు పదవి ఇవ్వడం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేసింది. అయితే ఈసారి కూడా తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం బిజెపి ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడికి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరు వినిపిస్తోంది.
* అన్నామలై కు నో ఛాన్స్..
వాస్తవానికి తమిళనాడుకు చెందిన బిజెపి నేత అన్నామలైకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తారని ప్రచారంలో ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతగా ఉన్న అన్నామలై పోటీ చేయలేదు. ఆయనను రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. ఏపీ నుంచి బిజెపి ఆయనకు ఛాన్స్ ఇస్తుందని టాక్ నడిచింది. అయితే తెలంగాణ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు మందకృష్ణ మాదిగకు బిజెపి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి మందకృష్ణ మాదిగను రాజ్యసభకు పంపించి తెలంగాణలో.. ఎస్సీ ఓటు బ్యాంకు పై బిజెపి గురిపెట్టినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.