Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇది స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బిజెపి విషయంలో వైసీపీ వైఖరి మారుతోంది. కాంగ్రెస్ పార్టీ స్వల్పంగా బలం పెంచుకుంది. దక్షిణాదిన ఐదు రాష్ట్రాలు ఉంటే.. అందులో నాలుగు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒక్క ఏపీలో మాత్రమే టిడిపి కూటమి అధికారంలో ఉంది. మొన్ననే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి విజయం సాధించింది. అయితే బిజెపి చంద్రబాబును బలంగా నమ్ముతుండడంతో ఇకమీదట ఆ పార్టీని నమ్ముకుంటే ఇబ్బందికరమని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే తన ఆలోచనను మార్చుకున్నట్లు అర్థమవుతోంది ఇటీవల పరిణామాలతో..
* ప్రధానిపై నోరోపారేసుకున్న వైసీపీ నేత…
ప్రధాని నరేంద్ర మోడీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని నోరు జారారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేసేందుకు సిద్ధమైంది అన్న వార్తలు వస్తున్నాయి. పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో భారత దేశంలో సంక్షోభం రాకుండా అందరూ పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దానిని ఎద్దేవా చేశారు పేర్ని నాని. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా మోడీపై ఈ తరహా విమర్శలు గతంలో ఎన్నడూ చూడలేదు. కచ్చితంగా వైసీపీ వ్యూహం మార్చి ఉంటుందన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. మొన్ననే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
* విజయ్ కు శుభాకాంక్షలు..
అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఖరి స్పష్టమైంది. తమిళనాడులో కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి. కానీ పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాం, పుదుచ్చేరిలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారికి ఎటువంటి శుభాకాంక్షలు తెలపలేదు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఓడిపోయారు. సువేందూ అధికారి సీఎం అయ్యారు. అయినా సరే జగన్ నుంచి అతనికి ఎటువంటి శుభాకాంక్షలు వెళ్లలేదు. తద్వారా జగన్మోహన్ రెడ్డి వైఖరి మారిందని స్పష్టం అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో.. ఆ పార్టీ మద్దతుతోనే అధికారంలోకి రావచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి అంచనాగా తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబుకు బలమైన మిత్రుడిగా భావిస్తోంది బిజెపి. అటువంటప్పుడు ఆ పార్టీని నమ్మడం శ్రేయస్కరం కాదని భావించి.. జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి