Bill Gates Chandrababu: ప్రపంచంలోనే ఐటీ దిగ్గజుడు బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ సహా అధ్యక్షుడు. ఆయనను కలవాలని ప్రతి దేశం నుంచి విన్నపాలు వెళ్తుంటాయి. ఆయన అపాయింట్మెంట్ సైతం దొరకడం చాలా కష్టం. ఆయనను ఒప్పించి, మెప్పించడం కూడా చాలా కష్టమైన పని. కానీ ఆ పని సులువుగా చేయగలిగారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయనతో ఏకంగా మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాదులో ఏర్పాటు చేయించారు. సైబరాబాద్ స్థాపనకు అదే దోహద పడింది. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారేందుకు మైక్రోసాఫ్ట్ ఏర్పాటు టర్నింగ్ పాయింట్ గా మారింది. అయితే దానికోసం తపనపడ్డారు చంద్రబాబు. బిల్ గేట్స్ ను ఒప్పించేందుకు ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు.. తొలుత చంద్రబాబు విన్నపాన్ని బిల్ గేట్స్ తిరస్కరించారు కూడా. కానీ ఆయనను ఒప్పించి మెప్పించడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
29 ఏళ్ల కిందట..
1997లో బిల్ గేట్స్( Bill Gates) ఇండియాలో పర్యటించారు. తమ మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల కోసం మన దేశానికి విచ్చేశారు. ఆ సమయంలో ఎంతోమంది ప్రముఖులు ఆయనను కలిశారు. ఆ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. ఢిల్లీలోని రాయబార కార్యాలయానికి సీఎం చంద్రబాబు ఒక విన్నపం చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అయ్యేందుకు అపాయింట్మెంట్ కోరారు. అయితే బిల్ గేట్స్ కు ఎంత సమయం లేదని అటు నుంచి సమాధానం వచ్చింది. అయితే ఒక్క పది నిమిషాల సమయం కావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసేసరికి.. బిల్ గేట్స్ ఒప్పుకున్నారు. కలిసేందుకు సమయం ఇచ్చారు. అలా తొలిసారిగా బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు చంద్రబాబు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఉమ్మడి రాష్ట్రంలోనూ.. హైదరాబాదులో ఐటి పెట్టుబడులకు సంబంధించి అనుకూలతలను.. భవిష్యత్తులో హైదరాబాద్ నగర ప్రాముఖ్యతను చంద్రబాబు వివరించారు. అయితే బిల్ గేట్స్ ఇచ్చిన 10 నిమిషాల సమయం పూర్తయిపోయింది. కానీ వారి మధ్య చర్చలు 45 నిమిషాల పాటు కొనసాగాయి. దాని ఫలితమే హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ స్థాపన.
ఇప్పటికీ అదే సాన్నిహిత్యం..
అలా కుదిరిన వారి మధ్య స్నేహం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్ బిల్ గేట్స్ ను కలిశారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. దీంతో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏపీలో కీలకమైన ఆరోగ్యం వైద్యం ప్రాజెక్టులో భాగస్వామ్యం అయింది. సంజీవని ప్రాజెక్టులో పాలు పంచుకుంటుంది. ఈరోజు అమరావతికి విచ్చేశారు బిల్ గేట్స్. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతోనే బిల్ గేట్స్ నేరుగా దేశంలో ఒక రాష్ట్రానికి రావడం అరుదైన విషయం. సాధారణంగా ఢిల్లీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. కానీ చంద్రబాబు అనుభవం, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే బిల్ గేట్స్ నేరుగా ఏపీకి వచ్చారు. ప్రస్తుతం అమరావతిలో సందర్శిస్తున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుతో బిల్ గేట్స్ కు ఉన్న సాన్నిహిత్యం పై చర్చ జరుగుతోంది.