spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Bhogapuram Airport: 'భోగా'పురమే.. రియల్ జోరు!

Bhogapuram Airport: ‘భోగా’పురమే.. రియల్ జోరు!

Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవంతో జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దాదాపు పనులన్నీ పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ముస్తాబయింది. ఉత్తరాంధ్ర తలరాతను మార్చబోతోంది ఈ విమానాశ్రయం. అయితే ఎయిర్పోర్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. విజయనగరం జిల్లా సరిహద్దులతోపాటు భోగాపురం చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో భూములతో పాటు ఇళ్ల స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు భారీగా ముందుకు వస్తున్నారు.

* అత్యాధునిక విల్లాలు..
సాధారణంగా వెంచర్లలో ప్లాట్లు విక్రయిస్తుంటారు. కానీ భోగాపురంలో ఓపెన్ ప్లాట్ల వెంచర్ల స్థానంలో.. సరికొత్తగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కమర్షియల్ విల్లా ప్రాజెక్టులు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కారిడార్ ఆనుకొని ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా.. వందల ఎకరాల్లో ఆధునిక టౌన్షిప్ ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభమైతే.. ఈ ప్రాంతం ఒక పెద్ద ఎకానమిక్ హబ్ గా మారనుంది. ప్రధానంగా ప్రీమియం నివాస గృహాలకు, కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

* ఆస్తిపై పెట్టుబడులు..
ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువ. ఆపై చదువుకున్న వారు సైతం విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో స్థిరపడిన వారు ఉన్నారు. అటువంటి వారంతా భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఉన్నత రంగాల్లో స్థిరపడిన వారు మాత్రం కమర్షియల్ విల్లాలు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ప్లాట్ లతోపాటు వెళ్లాలని ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. తమ సొంత గడ్డపై అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం పక్కనే స్థిరాస్తి కలిగి ఉండడాన్ని గొప్పగా భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ధర పెరుగుతుందన్న ఆశతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు.

* మూడు జిల్లాలపై ప్రభావం..
ఒక్క భోగాపురం మాత్రమే కాదు విజయనగరం జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటుంది భోగాపురం విమానాశ్రయ నిర్మాణంతో. భూములతో పాటు ఇళ్ల స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా భారీగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా మారనుంది భోగాపురం. భవిష్యత్తులో భోగాపురం ఒక నగరంగా అవతరించునుంది. వారం వారం ఇక్కడి చదరపు గజం ధరలు మారుతుండడంతో స్థానిక రైతులు, భూ యజమానులకు ఊహించని రీతిలో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version