Bedford School Amaravati: అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు సర్కార్ ప్రణాళిక. కేవలం ఒక్క రాజధాని మాత్రమే కాదు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్నది ఒక టార్గెట్. అందులో భాగంగా అంతర్జాతీయ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దాల అన్నది కూడా ఒక ఆలోచన. అందులో భాగంగా ఒక అంతర్జాతీయ సంస్థ తన క్యాంపస్ ను అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లండన్ లో 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బెడ్ ఫోర్డ్ తమ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాజధాని ప్రాంతానికి వస్తున్న మొట్టమొదటి విదేశీ విద్యాసంస్థ ఇదే కావడం విశేషం. ఇటీవల మంత్రివర్గ ఉప సంఘం కూడా దీనికి ఆమోదం తెలిపింది. అందుకే ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
* ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు..
బెడ్ ఫోర్డ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. లండన్ లో అత్యంత పురాతనమైన పాఠశాల ఇది. విపరీతమైన క్రెడిబిలిటీ సొంతం చేసుకుంది. ఈ చారిత్రాత్మక పాఠశాలను బ్రిటన్ లోని బెడ్ ఫోర్టులో 1552వ సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్-6 నెలకొల్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, క్రీడలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే బ్రిటన్ లో మాతృ సంస్థ ఉండగా.. మనదేశంలోని మొహాలీలో మాత్రమే అంతర్జాతీయ క్యాంపస్ ఉంది. అమరావతిలో మూడో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు రావడం విశేషం.
* 8 ఎకరాల కేటాయింపు..
రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ పాఠశాల నిర్మాణం కోసం సిఆర్డిఏ 8 ఎకరాల భూమిని కేటాయించింది. తుళ్లూరు సమీపంలో ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున విక్రయించింది. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న బెడ్ ఫోర్డ్ సంస్థ గ్లోబల్ స్కూల్ ను అమరావతిలో నిర్మించింది.. అయితే ఇప్పుడు కేటాయించిన స్థలంలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ లో జరిగిన అంతర్జాత యాజమాన్య మార్పు నేపథ్యంలో.. ఇండస్ స్థానంలో గ్లోబల్ బ్రాండ్ అయిన బెడ్ ఫోర్టును తీసుకొచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్తగా ఈ మోడల్ స్కూల్ అందుబాటులోకి రానుంది. అమరావతిని అంతర్జాతీయ ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. రాజధాని పరిధిలో ఇప్పటివరకు 22 ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. వీటికి గాను 844.897 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నాలుగు ప్రభుత్వ విద్యాసంస్థలు ఉండగా.. 18 ప్రైవేట్, అంతర్జాతీయ విద్యాసంస్థలు ఉండడం విశేషం.

