Andhra Pradesh New Pensions 2026: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలలోనే కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనుంది. ఐదు రకాల పింఛన్లకు సంబంధించి కొత్తగా దరఖాస్తులను స్వీకరించనుంది. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. తమ దరఖాస్తులతో పాటు ఐదు రకాల పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్, ఆధార్ నెంబర్ తో అనుసంధానించిన ఫోన్ నెంబర్, రేషన్ కార్డ్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు తో పాటు వాటిని తప్పకుండా జత చేయాలి. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో దరఖాస్తు చేయదలుచుకున్న వారు తప్పనిసరిగా ఈ ధ్రువీకరణ పత్రాలు ముందుగానే సమకూర్చుకోవాలి.
* ఐదు రకాల పత్రాలు తప్పనిసరి..
వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు సంబంధించి కొత్త పింఛన్లు మంజూరు కానున్నాయి. వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆ ఐదు రకాల పత్రాలతో పాటు 60 సంవత్సరాలు దాటినట్టు ధ్రువీకరణ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్ కార్డులు పుట్టిన తేదీ, సంవత్సరం తప్పనిసరిగా ఉండాలి. వితంతు పింఛన్ దరఖాస్తుదారులు ఆ ఐదు రకాల ధ్రువపత్రాలతో పాటు భర్త చనిపోయినట్టు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఒంటరి మహిళకు సంబంధించి భర్త నుంచి విడిపోయి ఉంటే కోర్టు ద్వారా తీసుకున్న విడాకులకు సంబంధించిన ధ్రువపత్రం తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. దివ్యాంగ పింఛన్లకు సంబంధించి ఐదు రకాల ధ్రువపత్రాలతో పాటు డాక్టర్ ఇచ్చే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి.
* రెండేళ్లుగా ఎదురుచూపు.
గత రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూశారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం భర్త పింఛన్ లబ్ధిదారుడు అయి ఉండి.. చనిపోతే అదే నెలలో భార్యకు పింఛన్ అందించే స్పౌజ్ కోటాను అమలు చేసింది. కానీ కొత్త పింఛన్ల విషయంలో ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్టి, ఎస్సీ వారికి పింఛన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చూస్తోంది. ఇలా కొత్త పింఛన్ల ద్వారా 15 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అయితే ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను ఈనెల 12 నుంచి సచివాలయాల్లో అందించాలని సూచిస్తోంది ప్రభుత్వం.
