MLC Anantababu Arrest: ఏపీలో( Andhra Pradesh) మరో రాజకీయ సంచలనం. ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్టయ్యారు. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేసిన అనంతబాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. రాజమండ్రి కోర్టు వద్ద ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఆయన ప్రయత్నించడం.. బెదిరించి ప్రలోభానికి గురి చేయడం వంటి వాటిపై నేరుగా బాధితులు ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అనంతబాబును అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. కానీ గత మూడు రోజులుగా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఎట్టకేలకు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. సాక్షులను బెదిరించారన్న ఫిర్యాదు వచ్చిన తర్వాత పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు వచ్చారు. కానీ అనంతబాబు పరారీలో ఉన్నారు.
* విచారణ అధికారి పై వేటు..
అయితే ఈ విషయంలో పోలీస్ విచారణ అధికారిపై అనుమానాలు ఉన్నాయి. ఆయన ఇచ్చిన సమాచారంతోనే అనంతబాబు( MLC anantababu ) పరారీ అయినట్లు ప్రచారంలో ఉంది. నిందితుడిని పట్టుకోవడంలో అలసత్వం వహించడమే కాకుండా.. ఆయనకు పోలీస్ శాఖ నుంచే సహకారం అందిన విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. సదరు విచారణ అధికారిని విఆర్ కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కొత్త అధికారికి బాధ్యతలు అప్పగించారు. దీంతో దర్యాప్తు వేగవంతం అయ్యింది.
* అతిపెద్ద నెట్వర్క్..
ఎమ్మెల్సీ అనంత బాబుకు అతిపెద్ద నెట్వర్క్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఆయన పరారీని పోలీస్ శాఖ( police department) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనంతబాబు కదలికలను ఎప్పటికప్పుడు గమనించారు పోలీసులు. రాజమండ్రి కోర్టు వద్దకు వచ్చినట్లుగా గుర్తించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు మాటువేసి.. కోర్టు పరిసరాల్లోనే ఆయనను చుట్టుముట్టి అరెస్టు చేశారు. మొత్తానికి అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో.. ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయ్యింది. పోలీస్ శాఖ వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.