Site icon OkTelugu

Minister Vasamsetti Subhash: తెలంగాణలో సెంటిమెంట్ అస్త్రానికి ఊపిరి పోసిన ఏపీ మంత్రి!

Minister Vasamsetti Subhash

Minister Vasamsetti Subhash

Minister Vasamsetti Subhash: రాష్ట్ర విభజన జరిగి దాదాపు పుష్కర కాలం సమీపిస్తోంది. ఎవరి పాలన వారు చేసుకుంటున్నారు. అయితే ప్రత్యేక భావోద్వేగ కోరికలతో ఏర్పడింది తెలంగాణ( Telangana). అయితే మూడు ఎన్నికలు జరగగా.. రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం పనిచేసింది. తెలంగాణ తెచ్చిన పార్టీగా టిఆర్ఎస్ను అందలం ఎక్కించారు తెలంగాణ ప్రజలు. 2023లో మాత్రం తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను గుర్తించి అధికారం ఇచ్చారు. ఇలా చూసుకున్న తెలంగాణలో సెంటిమెంట్ అస్త్రం ఉండనే ఉందన్నమాట. అందుకే అక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఎంత మాత్రం సెంటిమెంట్ లభిస్తే పొలిటికల్ గా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న కోనసీమ పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టి అనే మాట వ్యాఖ్యానించేసరికి.. రాజకీయ పార్టీలన్నీ ఏకమైపోయాయి. ఆ ఒక్క మాటను పట్టుకొని రాజకీయ విమర్శలు చేశాయి. అయితే ఇప్పుడు మరో ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ తమ కులానికి రిజర్వేషన్ల విషయంలో కెసిఆర్ అనుసరించిన వైఖరి పై మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి తెలంగాణలో సెంటిమెంట్ కు కారణం కానున్నాయి.

శెట్టిబలిజలు అధికం..
ఉమ్మడి రాష్ట్రంలో శెట్టిబలిజలు ( Setti balija )ఉన్నారు. బీసీలు గానే గుర్తిస్తుండేవారు ఆ వర్గాన్ని. అయితే రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణలో శెట్టిబలిజలను బీసీలనుంచి ఓసీలుగా మార్చారు. అయితే ఒకసారి బీసీలుగా గుర్తించిన తర్వాత ఓసీలుగా మార్చడం అరుదు. అప్పట్లో శెట్టిబలిజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కానీ కెసిఆర్ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. శెట్టిబలిజలను ఓసీలుగా నే భావించింది. ఆ జాబితాలో చేర్చేసరికి రిజర్వేషన్ల ఫలాలు శెట్టిబలిజలకు లేకుండా పోయాయి. రాజకీయంగా కూడా మనుగడ సాధించేందుకు ఇబ్బందికరంగా మారింది.

తన్ని తరిమేస్తామంటూ కామెంట్..
అయితే తాజాగా ఇదే విషయంపై మాట్లాడారు మంత్రి వాసంశెట్టి సుభాష్( Minister vasam Shetty Subhash ). శెట్టిబలిజల సామాజిక వర్గ కార్యక్రమానికి గాను ఆయన హాజరయ్యారు. ఆ సామాజిక వర్గ ప్రతినిధిగా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఏపీలో భారతీయ రాష్ట్ర సమితిగా పిలవబడే గులాబీ పార్టీ విస్తరణకు శరవేగంగా అడుగులు పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ప్రధానంగా కాపు, బలిజలను టార్గెట్ చేసుకొని ఇక్కడ పార్టీ విస్తరించాలని చూశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓటమితో ఆ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయి. అయితే దానిని ఉదహరిస్తూ కేసీఆర్ పార్టీ ఏపీలోకి రావాలని చూస్తే తన్ని తరిమేస్తామంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు. అయితే తన సామాజిక వర్గం విషయంలో అలా జరిగిందని ఆయన మాట్లాడి ఉండవచ్చు కానీ.. తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ ఆస్త్రాన్ని అందించినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పవన్ కేవలం దిష్టి అన్న వ్యాఖ్య చేసినందుకే రచ్చ రచ్చ చేశారు. కచ్చితంగా ఇప్పుడు ఏపీ మంత్రి వ్యాఖ్యలను వారు రాజకీయంగా వాడుకుంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Exit mobile version