AP Liquor Scam: ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే చాలామంది వైసిపి నేతలను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నించారు. వారి వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించారు. మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ వ్యవహారం కూడా జరిగినట్టు తేలడంతో.. ఈ వ్యవహారంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు. వారి వద్ద నుంచి కీలకమైన ఆధారాలు సేకరించారు. అక్రమ సంపాదనకు అలవాటు పడి.. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బులను వేరే వాటిలో పెట్టుబడులుగా పెట్టినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మని లాండరింగ్ కూడా చోటుచేసుకుందని దర్యాప్తు బృందం అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇప్పుడు ఏకంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డి మీద దృష్టి సారించారు. విజయవాడలో గురువారం 9 గంటల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయనను విచారించారు. ఆయన బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులు వివరాలు కూడా సేకరించారు. నాగేశ్వర్ రెడ్డి మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బులతో తన కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది..
నాగేశ్వర్ రెడ్డి మీద కొంతకాలంగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దృష్టిసారించారు. నాడు వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగేశ్వర్ రెడ్డి మద్యం కుంభకోణం లో కీలక పాత్ర పోషించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యక్తిగత కార్యదర్శి కావడంతో నాగేశ్వర్రెడ్డి మాటకు ఎదురులేకుండా పోయిందని.. పైగా మద్యం కుంభకోణంలో ఇతడు ముఖ్య పాత్ర పోషించాడని తెలుస్తోంది.. విచారణ మొత్తం పూర్తయిన తర్వాత ఏ క్షణమైన సరే నాగేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఏపీ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇదే కనుక జరిగితే తర్వాత టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అని రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తదుపరి అడుగులు ఎలా వేస్తారో చూడాల్సి ఉంది.
