AP Government Jobs 2026 Notification: ఏపీలో( Andhra Pradesh) నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ దారి చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఉగాదినాడు డీఎస్సీ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం సిద్ధపడినట్లు తెలుస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి.. జాబ్ క్యాలెండర్ ప్రకటనకు కసరత్తు జరుగుతోంది.
* ఉగాది సందర్భంగా..
మార్చి 19న ఉగాది. తెలుగు ప్రజల కొత్త సంవత్సరం. ఆరోజున డీఎస్సీ( DSC ) నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ కాలీల వివరాలను సేకరించింది. 3600 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి భర్తీ చేయాలని ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. తాము అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే అధికారంలో వచ్చిన వెంటనే 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు మరో డీఎస్సీ ప్రకటనకు సిద్ధపడుతున్నారు.
* 3600 పోస్టులతో…
మొన్న 16 వేల ఉపాధ్యాయ పోస్టులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరింది. ఇప్పుడు మరోసారి ఖాళీల భర్తీకి సిద్ధపడుతోంది ప్రభుత్వం. ఆదర్శ, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్, సంక్షేమ శాఖల పాఠశాలల్లో 1200 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్, మునిసిపల్, ప్రభుత్వ పాఠశాలల్లో 1700 ఖాళీలు ఉన్నాయి. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి 700 వరకు ఖాళీలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి 3600 పోస్టులతో ఉగాదినాడు డీఎస్సీ ప్రకటన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరోవైపు ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దాదాపు 99 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటన్నింటినీ జాబ్ క్యాలెండర్లో ప్రకటించనున్నారు.