Site icon OkTelugu

AP DSC 2025 Updates: డీఎస్సీ 2025.. నియామక పత్రాలు, పోస్టింగ్స్ పై అప్డేట్!

AP DSC 2025 Updates

AP DSC 2025 Updates

AP DSC 2025 Updates: ఏపీలో( Andhra Pradesh) డీఎస్సీ నియామకాల కు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎంపికైన ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు కూడా అందజేయనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈనెల 18న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత రోజున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 16,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ నియామక పత్రాల పంపిణీ ఎప్పుడు అనేది క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వెంటనే వారికి శిక్షణ కూడా ఇవ్వనుంది. దసరా సెలవులు ముగిసిన వెంటనే వారికి పోస్టింగ్ దక్కనుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక షెడ్యూల్ కూడా రూపొందించింది ఏపీ పాఠశాల విద్యాశాఖ.

హామీ నిలబెట్టుకున్న చంద్రబాబు..
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ( Mega DSC ) ప్రకటిస్తారని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మాదిరిగానే అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఫైల్ పై సంతకం చేశారు. ఏడాది ఏప్రిల్ 20న 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్ నుంచి జూలై మధ్యలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఆగస్టులో రిజల్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్టును ప్రకటించారు. ధ్రువపత్రాలను పరిశీలించి.. ఎంపికైన వారితో తుది జాబితాలను ప్రకటించారు. నియామక పత్రాలు అందజేసి శిక్షణను పూర్తి చేయాలని చూశారు. అయితే వర్షాలు కారణంగా కార్యక్రమం రద్దయింది. కానీ ఇప్పుడు ఈనెల 25న అమరావతిలో సభ ఏర్పాటు చేసి ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. దసరా సెలవుల్లోనే శిక్షణ ఇచ్చి.. పాఠశాలలు తెరిచే సమయానికి పోస్టింగ్స్ ఇవ్వనున్నారు.

రెండు రకాల ఆలోచనలతో..
డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుల శిక్షణ విషయంలో రెండు రకాల ఆలోచనలతో ఉన్నారు అధికారులు. దసరా సెలవుల్లో( Dasara holidays ) శిక్షణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అభ్యంతరాలు వస్తే మాత్రం తరువాత శిక్షణ ఇచ్చి అపాయింట్మెంట్స్ ఇవ్వనున్నారు. అయితే దసరా సెలవులు అక్టోబర్ రెండు తో ముగియనున్నాయి.3 న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఆ రోజు నుంచి కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారు విధుల్లో చేరే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చివరి నిమిషంలో మార్పులు మినహా.. మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25న నియామక పత్రాలు అందిస్తారు.

వేడుకగా కార్యక్రమం
ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు( appointment letters ) అందించే కార్యక్రమాన్ని వేడుకగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వైసిపి హయాంలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. 2019 ఎన్నికలకు ముందు ఏటా డీఎస్సీ ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలు చేయలేకపోయారు. అయితే చంద్రబాబు మాత్రం తన మాటను నిలబెట్టుకున్నారు. మెగా డీఎస్సీ ప్రకటించి నియామక ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. అందుకే ఉపాధ్యాయ వర్గాల్లో సంతృప్తిని పెంచేలా కార్యక్రమాన్ని వేడుకగా జరపాలని భావిస్తున్నారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు చేతులమీదుగా నియామక పత్రాలు అందిస్తారు. ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు విద్యాశాఖ అధికారులు.

Exit mobile version