Delimitation Bill: ఏపీలో నియోజకవర్గాల పెంపు కచ్చితంగా ఉంటుందని నేతలు నమ్మకంగా ఉన్నారు. మొన్ననే పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి వెనక్కి తీసుకుంది కేంద్రం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. మూడింట రెండో వంతు మెజారిటీ లేక వీగిపోయింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితి మారింది. బెంగాల్లో టీఎంసీ ఎంపీలు ఎన్డీఏ శిబిరానికి వచ్చారు. మరోవైపు మహారాష్ట్రలో సైతం చాలామంది ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. తమిళనాడులో స్టాలిన్ సైతం ఈసారి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మరోసారి పార్లమెంటులో మహిళా బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పెట్టనుంది కేంద్రం. ఆమోదిస్తే దేశవ్యాప్తంగా నియోజకవర్గాలు పెరుగుతాయి.
* భారీగా సీట్ల పెరుగుదల..
జనాభాతో సంబంధం లేకుండా ఇప్పుడున్న అసెంబ్లీతో పాటు ఎంపీ సీట్లు 50 శాతం పెంచేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. అదే జరిగితే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 80 వరకు పెరగవచ్చు. పార్లమెంటు సీట్లు మరో 13 వరకు పెరుగుతాయి. కచ్చితంగా అధికార పార్టీకి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా తెలుగుదేశం ఉంది. తమకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదు.
* జనసేనలో చేరికలు..
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి పక్కా సమాచారం జనసేనకు ఉంది. అందుకే ఆ పార్టీ చేరికల కమిటీని ఏర్పాటు చేసింది ఓ 14 మంది నేతలతో. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పట్టున్న నాయకులు, ఆ పార్టీపై అసంతృప్తిగా ఉండే నేతలు జనసేనలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకు ప్రాతినిధ్యం పెరిగితే కీలక నేతలకు చాన్స్ రావచ్చు. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు తో పాటు అసంతృప్తులను సైతం తగ్గించవచ్చు. మొన్నటికి మొన్న నియోజకవర్గాల పునర్విభజన పై లోలోపల భయపడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లు వెనక్కి వెళ్లిపోవడంతో సంతోషించింది. కానీ ఇప్పుడు మరోసారి ఆ బిల్లు పార్లమెంటు ముంగిటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే తమకు ఇబ్బందులు తప్పవు అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది.
