AP BJP Crisis: ఏపీలో బిజెపి ప్రక్షాళన దిశగా హై కమాండ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీ నేతల వ్యవహార శైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ అభివృద్ధిపై నేతలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. పైగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. పార్టీని బలోపేతం చేయడం లేదు. దీనిపై హై కమాండ్ కు స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే నేతల తీరుపై పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ ముఖ్యమైన నేతను పిలిచి గట్టిగానే క్లాసు పీకినట్లు తెలుస్తోంది. సదరు నాయకుడి ఎదుట నేతల పనితీరు, వ్యవహార శైలి బయట పెట్టినట్లు సమాచారం. అందుకే మొత్తం మార్పు దిశగా అడుగులు వేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
* సొంతంగా ఉనికి ఏది?
ఏపీలో భారతీయ జనతా పార్టీ కనీసం సొంతంగా ఉనికి చాటుకునే పరిస్థితిలో లేదు. తెలుగుదేశం పార్టీతో కలిసిన సమయంలో మాత్రమే ఓట్లతో పాటు సీట్లు పెరుగుతున్నాయి. ఒంటరిగా పోరాటం చేస్తున్న ప్రతిసారి ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు రావడం లేదు. 2014లో టిడిపి తో కలిసి పోటీ చేస్తే ఎమ్మెల్యే తో పాటు ఎంపీ స్థానాలను దక్కించుకుంది బిజెపి. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎనిమిది ఎమ్మెల్యేలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు ఆ పార్టీకి దక్కాయి. అయితే ఇప్పుడు కూడా ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. కనీసం పార్టీ కోసం పట్టించుకునే వారు కరువవుతున్నారు.
* మాధవ్ పై అసంతృప్తి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన పివిఎన్ మాధవ్ పార్టీని అభివృద్ధి చేస్తారని హైకమాండ్ భావించింది. ఆయనపై చాలా రకాలుగా అంచనాలు పెట్టుకుంది. కానీ ఎందుకో ఆయన ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ప్రారంభంలో హడావిడి చేశారు. తరువాత ప్రెస్ మీట్ లకే పరిమితం అవుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరన్న విమర్శలు ఉన్నాయి. పార్టీకి పెద్దదిక్కుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఆయనకు ఢిల్లీలో పరపతి ఉంది. సీఎం చంద్రబాబు వద్ద గౌరవం ఉంది. అందుకే ఆయన కేంద్ర ప్రభుత్వపరంగా, రాష్ట్ర ప్రభుత్వపరంగా పనులు చేసుకుంటున్నారు. స్థానికంగా పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరన్న విమర్శ ఉంది. దగ్గుబాటి పురందేశ్వరి పరిస్థితి కూడా అదే. మొన్నటి ఎన్నికల వరకు ఆమె బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండేవారు. ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా కూడా ఉన్నారు. కనీసం వారంలో ఒక్కరోజు కూడా ఆమె అందుబాటులో ఉండడం లేదు. ఆమె తరుపున కూడా ఎవరు లేకుండా పోయారు పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇవన్నీ పార్టీ దృష్టికి వెళ్లాయి కూడా.. అందుకే హై కమాండ్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
* త్వరలో స్థానిక ఎన్నికలు..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మూడు పార్టీలు కలిసి వెళ్తాయి. కానీ క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి బలం లేదు. ఆ బలం పెంచుకునే ప్రయత్నం కూడా జరగలేదు. జిల్లా కమిటీలు ఉన్నాయంటే ఉన్నాయి. కనీసం గ్రామస్థాయి కమిటీలు లేవు. మండల కమిటీలు కానరావు. నియోజకవర్గాలు ఇన్చార్జులు ఉన్న ఫలితం లేదు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో బూత్ లెవెల్ లో బలమైన కమిటీలు ఉంటాయి. కానీ ఏపీ విషయానికి వచ్చినప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇలానే కొనసాగితే ఏపీ బీజేపీలో ప్రక్షాళనకు హైకమాండ్ ప్రయత్నించే అవకాశం ఉంది. కచ్చితంగా చాలా రకాల మార్పులకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
