AP Defence Project: ఏపీకి( Andhra Pradesh) మరో గుడ్ న్యూస్ అందింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు డిఆర్డిఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షణ రంగంతో పాటు ఏరోస్పేస్ లో ముద్ర చాటుకోనుంది ఏపీ. సత్యసాయి జిల్లాలో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబు ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమయింది. బెంగళూరుకు అతి సమీపంలో సత్యసాయి జిల్లా ఉండడం కలిసి వచ్చే అంశం. రక్షణ రంగంలో భారీ ప్రాజెక్టు జిల్లాకు కేటాయించడం అనేది విశేషమే. ఈ పరిశ్రమ ఏర్పాటుతో జిల్లా కూడా అభివృద్ధి చెందనుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగు పడనున్నాయి.
* భారీ పెట్టుబడితో..
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో( Puttaparthi) 15వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాలు ఇక్కడ తయారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ DRDO ( రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ) ఇక్కడ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సీఎం చంద్రబాబు ఈనెల ఈ పరిశ్రమకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాకతో దేశంలో రక్షణ రంగం చిత్రపటంలో శ్రీ సత్య సాయి జిల్లాకు చోటు దక్కనుంది. దేశీయంగా అత్యాధునికంగా యుద్ధ విమానాలను ఇక్కడ తయారు చేయనున్నారు. రక్షణ రంగాలకు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ తోపాటు నావి ఈ యుద్ధ విమానాలను వినియోగించుకోనున్నాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న సుఖోయ్ ఎస్ యు-30 యుద్ధ విమానాలకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ అత్యాధునిక విమానాలను తయారు చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 600 ఎకరాల భూమిని డిఆర్డిఓకు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అవసరార్థం మరో నాలుగు వందల ఎకరాలను అందుబాటులో ఉంచింది. 2029 నాటికి తొలి విమానాన్ని ఆవిష్కరించాలన్నది లక్ష్యం. 2035 నాటికి పూర్తిస్థాయిలో విమాన తయారీ ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలన్నది టార్గెట్.
* వరుసగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు
శ్రీ సత్య సాయి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు అవుతుండడం శుభపరిణామం. ముఖ్యంగా రక్షణ శాఖతోపాటు ఏరోస్పేస్ రంగానికి హబ్ గా మారుతోంది జిల్లా. ఇప్పటికే పాలసముద్రం సమీపంలో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్( BEL ) 1000 ఎకరాల్లో డిఫెన్స్ సిస్టం ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసింది. అలాగే మడకశిరలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టం లిమిటెడ్ 2500 కోట్ల రూపాయలతో.. వెయ్యి ఎకరాల్లో డిఫెన్స్ ఎనర్జిటిక్ తయారీ కాంప్లెక్స్ ను నిర్మించనుంది. ఇప్పుడు డిఆర్డిఓ ఏకంగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు సిద్ధపడుతుండడంతో.. రాయలసీమ.. అందులోనూ శ్రీ సత్యసాయి జిల్లా రక్షణ రంగం లో హబ్ గా మారనుందన్నమాట.