Andhra Pradesh Heatwave: ఏపీలో( Andhra Pradesh) ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. మున్ముందు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని స్పష్టం చేస్తోంది. ఇకనుంచి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందేనని తేల్చి చెబుతోంది. కడప జిల్లా ఒంటిమిట్టలో అయితే మంగళవారం 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వేడిగాలులు ప్రారంభం అయ్యాయి. ఈనెల 18 వరకు ఈ గాలుల తీవ్రత ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఒక్కసారిగా పెరిగిన ఎండలు,, ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
* అన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి..
రాష్ట్రంలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్ల ఎండల తీవ్రత పెరిగింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నాలుగు, విజయనగరంలో 19, పార్వతీపురం మన్యంలో 14, అల్లూరి సీతారామరాజు 1, పోలవరం లో నాలుగు, అనకాపల్లిలో రెండు, కాకినాడలో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క మండలాన్ని కలుపుకొని.. రాష్ట్ర వ్యాప్తంగా 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయి. మరో 73 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
* కడప జిల్లా ఒంటిమిట్టలో మంగళవారం రికార్డు స్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. కర్నూలు జిల్లా లద్దగిరి, నంద్యాల జిల్లా సంజామలలో 44.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెం లో 43.8°, మార్కాపురం జిల్లా అనుమల పల్లి లో 43 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 43 డిగ్రీలు, అనంతపురం జిల్లా రాయదుర్గం తో పాటు పల్నాడు జిల్లా దుర్గి, శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల లో 42.8 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
