AP Heat Wave Action Plan 2026: ఏపీ( Andhra Pradesh) నిప్పుల కొలిమిలా మారింది. ప్రారంభంలోనే వేసవి తాపం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో రాష్ట్రం మండిపోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అన్ని జిల్లాలకు గట్టి హెచ్చరికలే పంపుతోంది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రస్థాయి ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026’ ను ఆవిష్కరించారు. ఎండల తీవ్రతను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అయితే గత రెండు రోజులుగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మున్ముందు ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో ప్రమాదం తప్పదు అని భారత వాతావరణ శాఖ సైతం హెచ్చరించింది.
రాబోయే రోజులపై హెచ్చరికలు..
అమరావతి( Amravati ) వాతావరణ కేంద్రం కీలక సూచనలు చేసింది. రాబోయే రెండు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుంది కానీ.. తరువాత నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.
Also Read: ఏపీలో కొత్తగా రూర్బన్ పంచాయతీలు!
హోంమంత్రి కీలక ఆదేశాలు..
అధికారులతో సమీక్షలు జరిపిన హోం శాఖ మంత్రి అనిత( home minister Anita) జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ తక్షణమే స్పందించి వడదెబ్బ బారిన పడేవారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, అవసరమైన మందులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్రమజీవుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి మార్కెట్లు, బస్టాండ్లు, ప్రధానకూడళ్ళ వద్ద తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఎండలు పెరుగుతున్న వేల తాగునీటి సరఫరా లో, విద్యుత్ సరఫరా లో ఎటువంటి అంతరాయం కలుగకుండా చూడాలని సంబంధిత శాఖకు సూచించారు హోం మంత్రి అనిత.