Andhra Pradesh Politics: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన సంక్లిష్టత ఎదుర్కొంటోంది. ఒక్క రాజకీయంగానే కాదు.. జగన్మోహన్ రెడ్డి కుటుంబపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కూటమి బలంగా ఉంది. పార్టీ నేతలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. తన అవినీతి కేసులు సైతం వేగవంతం అయితే పరిస్థితి ఏంటి అనేది అంతు పట్టడం లేదు. ఇంకోవైపు కేంద్ర సహకారం కూడా లేకుండా పోతోంది. మరోవైపు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య అంశం సజీవంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం సరికొత్త పేరు పెట్టింది. గొడ్డలి పార్టీ అంటూ పెట్టిన పేరు ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అయితే ఇందుకు వైసిపి నేతలే సహకరిస్తున్నారు.
* మాజీ మంత్రి ఆవేదన..
మాజీ మంత్రి విడదల రజిని ప్రెస్ మీట్ పెట్టి మరి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీగా ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కు గురవుతున్నారు. గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటున్నారు అంటే.. షర్మిల తో పాటు సునీత చేసిన కామెంట్స్ ను జతపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గొడ్డలితో నరికి చంపారని హత్య జరిగిన రోజు చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఆ వీడియోను సైతం జత చేస్తున్నారు. అనవసరంగా విడదల రజిని ఈ అంశాన్ని కెలికి.. లేనిపోని వివాదాన్ని తెచ్చుకున్నారు.
* గుండెపోటు ఆపై హత్య
2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు. తరువాత దానిని హత్యగా చెబుతూ రాజకీయ ప్రాద్బలంతోనే ఈ హత్య జరిగినట్లు ఆరోపించడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అభియోగం మోపి ఎన్నికల్లో సానుభూతి పొందారు. తరువాత అధికారంలోకి వచ్చి కేసును ఎంత నీరుగార్చాలో అంతలా చేశారు. ఇప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలిసాయి. అదే సమయంలో 2029 ఎన్నికల వరకు వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని సజీవంగా ఉంచాలని కూటమి భావిస్తోంది. అందుకే గొడ్డలి పార్టీ అంటూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విడదల రజిని గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటారు అని ప్రశ్నించడం ద్వారా.. మరోసారి తేనె తుట్టను కదిపారు.