Anchor Shyamala YSRCP Controversy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నేతకు ఎప్పుడు ప్రాధాన్యం లభిస్తుందో.. ఎప్పుడు లభించదో తెలియని పరిస్థితి. అధినేతకు తగ్గట్టు వ్యవహరించకపోతే ఆ పార్టీలో చాన్స్ ఉండదు. స్వయంగా నిర్ణయాలు తీసుకుని మాట్లాడుతామంటే కుదరదు. కచ్చితంగా స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాలి. లేకుంటే మాత్రం సైడ్ చేయడం ఖాయం. ఇప్పుడు యాంకర్ శ్యామల పరిస్థితి కూడా అదే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించి అనవసరంగా తన కెరీర్ ను ఇబ్బందుల్లో పెట్టుకున్నారు. దీంతో ఆమె పూర్తిస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా మారిపోయారు. హై కమాండ్ సైతం ఆమెను అధికార ప్రతినిధిగా నియమించి గౌరవించింది. ఇక శ్యామలకు తిరుగు ఉండదు అని అంతా భావించారు. కానీ ఇప్పుడు 10 నెలలు అవుతున్నా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఆమెను పార్టీ దాదాపు సైడ్ చేసినట్టే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* తెగ హడావిడి..
మొన్నటి ఎన్నికల ప్రచారంలో తెగ హడావిడి చేశారు శ్యామల. నియోజకవర్గాలను చుట్టేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సెలబ్రిటీ హోదాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆమెను గౌరవించారు. వివిధ జిల్లాల్లో శ్యామల పర్యటనలు కూడా చేశారు. అయితే ఇదంతా తన సొంత ఇమేజ్ అని ఆమె భావించారట. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ.. తప్పకుండా గెలుపు.. హోం మంత్రి అవుతానంటూ ప్రకటనలు వంటివి ఆమె నుండి వచ్చాయట. ఈ విషయం హై కమాండ్ కు చేరడంతో ఆమెను పక్కన పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. గత పది నెలలుగా ఆమె కార్యాలయంలో అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. అయితే ఆమెను సైడ్ చేశారన్న కామెంట్స్ తో శ్యామల స్పందించారు. అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఇంత జరిగాక కూడా ఆమె పార్టీ కార్యాలయానికి వచ్చి మాట్లాడడం లేదు. ఇంకా డిజిటల్ ప్లాట్ ఫామ్ నుంచి మాట్లాడుతున్నారు.
* బుల్లితెరపై మెరుస్తూ..
బుల్లితెరపై మెరుస్తూ వచ్చారు శ్యామల. యాంకర్ గానే కాకుండా తనకంటూ ఒక మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి వైసిపి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వైసిపి అధికారంలో ఉండడంతో అటువైపు మొగ్గు చూపారు. ఒకవైపు టిడిపి తో పాటు జనసేనకు సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో శ్యామలకు అవకాశాలు సన్నగిల్లాయి. అయినా ఆమె వైసీపీ అధికారంలో ఉండడంతో.. మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి చాలా దూకుడుగా వ్యవహరించారు. కానీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. శ్యామలపై రాజకీయ ముద్ర పడడంతో కెరీర్ పరంగా ఇబ్బందులు వచ్చాయి. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆమెను అధికార ప్రతినిధిగా నియమించింది. కానీ ఆమె వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డికి నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే దూరం పెట్టినట్లు సమాచారం. మరి లోలోపల ఏం జరిగిందో వారికే తెలియాలి.
