Amaravati Capital Bill 2026: అమరావతి రాజధానికి( Amravati capital ) ఈరోజు కీలకం కానుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ ముందుకు రానుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. టిడిపి తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు మరో ఇద్దరు ఎంపీలు ఈ చర్చలో పాలుపంచుకుంటారు. గత అనుభవాల దృష్ట్యా అమరావతికి చట్టబద్ధత అనేది ఆవశ్యంగా మారింది. తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత రాలేదు. ప్రత్యేక విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!
* గత అనుభవాల దృష్ట్యా..
దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత లేదు. కానీ ఏపీలో తరచూ అమరావతిపై వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ విషం చిమ్ముతూనే ఉంది. వ్యతిరేక ప్రచారం నడుస్తూనే ఉంది. దాని ప్రభావం అమరావతిపై పడుతూ వచ్చింది. భవిష్యత్తులో కూడా మళ్లీ అమరావతిని టచ్ చేయకుండా ఉండాలి అంటే చట్టబద్ధత ఏకైక మార్గం అని నిపుణులు సూచించారు. అటు అమరావతి రైతులు సైతం అదే తరహా ఆందోళనతో గడిపేవారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబుకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపం మేరకు చంద్రబాబు సైతం కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామి కావడంతో కేంద్రం కూడా ప్రాధాన్యమిచ్చింది. అందుకే సవరణ బిల్లు సిద్ధమయింది. హోం శాఖ నుంచి కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళ్ళింది. అక్కడ గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
* కేంద్ర ప్రభుత్వ చొరవ..
ఈ బిల్లు ప్రక్రియలో కూడా కేంద్ర ప్రభుత్వం( central government) చాలా చొరవతో ముందుకు వెళ్తోంది. సాధారణంగా బిల్లులు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్ కు వస్తాయి. అయితే ఈ బిల్లు బిజినెస్ రూల్స్ 12b నిబంధనను ఉపయోగించి క్యాబినెట్ ఆమోదంతో సంబంధం లేకుండానే నేరుగా పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన వంటి అత్యంత కీలకమైన అంశాల్లో మాత్రమే కేంద్రం ఈ తరహా వ్యూహాన్ని అమలు చేసింది. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే దూకుడును ప్రదర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఏపీ తమకు కీలకమని.. అక్కడ తమ భాగస్వామ్య పక్షాల రాజకీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమైన రీతిలో వ్యవహరించింది కేంద్రం.
పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత ఈ బిల్లు కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళుతుంది. అక్కడ లాంఛనప్రాయ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మన రాష్ట్రానికి సంబంధించి కేవలం టిడిపి మాత్రమే కాదు బిజెపి ఎంపీ పురందేశ్వరి, జనసేన పార్టీ నుంచి ఒక ఎంపీ అమరావతి ఆవశ్యకతను, ఈ బిల్లు వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను సభకు వివరిస్తారు. తరువాత సభ ఆమోదం పొందుతుంది. గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్ళనుంది. అయితే వైసీపీ స్టాండ్ ఏంటన్నది తెలియడం లేదు. తాము మాట్లాడతామని వైసిపి సభ్యులు ఎవరు ఇప్పటివరకు అధికారికంగా స్పీకర్ కార్యాలయానికి సంప్రదించలేదు.
