Homeఆంధ్రప్రదేశ్‌TDP: కాయ ఇంక పండలేదు.. టిడిపి మీడియా ష్ గప్ చుప్

TDP: కాయ ఇంక పండలేదు.. టిడిపి మీడియా ష్ గప్ చుప్

TDP: ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి మధ్య పొత్తు కుదిరింది. పోటీ చేయాలనే నిర్ణయం కూడా ఏకాభిప్రాయానికి వచ్చింది. మరి సీట్ల కేటాయింపు? వీటి కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాను కలిశారు. అయితే ఈ చర్చల్లో సీట్ల కేటాయింపులు ఒక కొలిక్కిరానట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఈ సీట్ల కేటాయింపు అనేది జరిగితే టిడిపి అనుకూల మీడియా ఊరుకునేది కాదు. “మా చంద్రబాబు దేవుడు, ఆయన చెప్పినట్టే బిజెపి నడుచుకుంది. ఆయన ఆదేశించినట్టే జనసేన ప్రవర్తించింది. ఇక తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. చంద్రన్నా నీకు జయము జయము” అనే లెవెల్ లో రాసేది. కానీ అక్కడ చంద్రబాబు ఆశించినంత ఈజీగా సీట్ల కేటాయింపు జరగలేదు. 15 నుంచి 20 సీట్లు కేటాయించని పక్షంలో బిజెపి ఓటు బ్యాంకు టిడిపికి వెళ్ళదు. 45 నుంచి 50 సీట్లు కేటాయించిన పక్షంలో జనసేన ఓటు బ్యాంకు టిడిపికి వెళ్ళదు. ఇవి క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలు. వీటిని అత్యంత జాగ్రత్తగా టిడిపి అనుకూల మీడియా భూమరాంగ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అనే కవరింగ్ ఇస్తూ చంద్రబాబును గొప్ప లీడర్ అని కలరింగ్ ఇస్తోంది.. అంతేకాదు జగన్ ను ఓడించడమే బిజెపి, జనసేన ధ్యేయంగా ప్రకటించుకున్నాయని.. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా ఒప్పుకుంటాయి అని అర్థం వచ్చేలా టిడిపి అనుకూల మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయి.

వాస్తవానికి 2014లో జనసేన, బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన టిడిపి ఆ తర్వాత ఎలాంటి వ్యవహారాలు నడిపిందో అందరికీ తెలుసు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పక్షాన పోరాడుతున్నాడని తెలిసి అనుకూల మీడియా పవన్ కళ్యాణ్ పై వ్యతిరేక కథనాలు ప్రచురించింది. ఇక నరేంద్ర మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఈలోగా కాలం గడిచిపోయింది. చంద్రబాబు చేతిలో నుంచి అధికారం పోయింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. అటు రెండోసారి గెలిచి అందరి నోళ్ళు ముగించాలని జగన్ తాపత్రయపడుతున్నాడు. ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు తపన పడుతున్నాడు. ప్రశ్నించే గొంతుకగా అసెంబ్లీలో సత్తా చాటాలి అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సాక్షి మీడియా అనుకూలంగా ఉండగా.. చంద్రబాబు నాయుడుకి పచ్చ మీడియా బాకాలు ఊదుతోంది. పవన్ కళ్యాణ్ తో అవసరం కాబట్టి, బిజెపితో పొత్తు అనివార్యం కాబట్టి పచ్చ మీడియా వారిద్దరి ప్రస్తావన తీసుకొస్తున్నది. లేకుంటే విలువలు వలువలు లేకుండా వార్తలు రాసేదే.

టిడిపి 2014 లోనూ ఇలాగే జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టింది. అన్నిటికంటే టిడిపి అనుకూల మీడియా విశ్వరూపాన్ని చూపించింది. పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీపై అడ్డగోలుగా కథనాలు రాసింది.. చంద్రబాబు అయితే నోటికి వచ్చిందే అన్నట్టుగా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఆ మూడు పార్టీలు మళ్లీ ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నాయి. సాధారణంగా సీట్ల విషయంలో తేల్చని చంద్రబాబుకు అమిత్ షా కోలుకోలేని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే భేటీ అయిన తర్వాత చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలక చర్చలు జరిపాం. త్వరలో అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయానికి వస్తాయని సన్నాయి నొక్కులు నొక్కారు. అందువల్లే టిడిపి మీడియా సైలెంట్ అయిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు పిలిచారు కాబట్టి.. చంద్రబాబు వెళ్లారు అనే కోణంలో వార్తలు రాసుకువస్తోంది. కానీ చంద్రబాబుతో పొత్తు కోసం బిజెపి ఎప్పుడు తహతహలాడింది? చంద్రబాబే కదా ఆ మధ్య నరేంద్ర మోడీని కలవడానికి వెళ్ళింది.. ఆయన అపాయింట్మెంట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసింది.. ఢిల్లీలోని అశోక హాల్లో మాట్లాడిన తర్వాత ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకుంటున్నామని సంకేతాలు ఇచ్చింది.. బిజెపి ఏనాడు కూడా చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అని ప్రకటించలేదు. పైగా కూటమి సమావేశాలకు చంద్రబాబును పిలవలేదు. పవన్ కళ్యాణ్ ను మాత్రం నరేంద్ర మోడీ పిలిచారు. దగ్గరికి తీసుకొని మాట్లాడారు. కానీ ఈ విషయాన్ని టిడిపి అనుకూల మీడియా రాయదు. సీట్ల కేటాయింపు విషయం కూడా ఒక కొలిక్కి రాలేదు అనే వార్తను ప్రచురించదు. స్థూలంగా చెప్పాలంటే కాయ ఇంకా పండు కాలేదు. కానీ టిడిపి మీడియా దానిని రాయదు, రాయలేదు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular