Jagan new politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి వింతగా ఉంది. తన ప్రత్యర్థులను పొగుడుతుంటారు. తన మూలాన్ని మరిచిపోతుంటారు. ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాన్ని ఎత్తిచూపారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్. దానిని తప్పు పట్టారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక అంతర్జాతీయ వేదికపై అలా చేయడం తప్పు అని వ్యాఖ్యానించారు.
సమోసాల ఖర్చు నీచం..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యానాలు చేయడం శుభపరిణామం. కానీ ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల విషయంలో అడ్డు తగలడం ఎంతవరకు సమంజసం. నిన్ననే బిల్ గేట్స్ వచ్చారు. ఆయన ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు అని తెలుసు. ఆయన కోసం ఎన్నెన్నో ప్రభుత్వాలు, పాలకులు ప్రయత్నాలు చేస్తుంటారని తెలుసు. అటువంటి వ్యక్తి ఏపీని వెతుక్కుంటూ రావడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు తప్పుపడుతున్నట్టు? చాలా చీప్ గా ఆయన పర్యటనకు సంబంధించి సమోసా లెక్కలు అడుగుతున్నారు. ఖర్చులు అడుగుతున్నారు. ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ చేసినది తప్పిదం అయితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహార శైలి సైతం ముమ్మాటికీ తప్పు. ఇది ఒప్పుకోవాల్సిన నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి పై ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పై విమర్శలు
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ దేశ ప్రయోజనాల కోసమే. కానీ రకరకాల కారణాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భావితరాలకు ప్రమాదం అని వాదిస్తోంది. అందులో భాగంగానే ఈ నిరసన కార్యక్రమాలు అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన జగన్ చాలా సందర్భాల్లో బిజెపికి అనుకూలంగా మాట్లాడారు. అది ఆయనపై ఉన్న వ్యక్తిగత కేసుల కోసమేనని అర్థమవుతోంది. లేకుంటే తాను రాజకీయంగా విపరీతంగా ద్వేషించే చంద్రబాబు ఉండే ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన బీజేపీని వ్యతిరేకించాలి. కానీ బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాన్ని వ్యతిరేకించారు జగన్. అయితే ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రయోజనాలను అనుసరించి బిల్ గేట్స్ను రప్పించింది. అది తప్పుగా వైసిపి చూపింది. కానీ బిజెపి సదస్సును మెచ్చుకొని తనదైన రాజకీయం చూపి కాంగ్రెస్ ను వ్యతిరేకించారు జగన్. ఇప్పుడు జగన్ పైనే జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. బిజెపి కూటమిలోని టిడిపిని వ్యతిరేకిస్తున్నారు. బిజెపి ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నారు. అదే సమయంలో టిడిపి కూటమి ప్రభుత్వ విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి రాజకీయం అంటూ జాతీయస్థాయిలో ఇతర పార్టీల నేతలు జగన్మోహన్ రెడ్డి విషయంలో ముక్కున వేలేసుకుంటున్నారు.